- గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తాం
- వారి అభివృద్ధే మా లక్ష్యం
- కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి
- వనదేవతలను దర్శించుకున్న కేంద్ర మంత్రి
ములుగు, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : అమ్మవార్ల దీవెనతో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వొస్తుందని, అధికారంలోకి రాగానే రాష్ట్రంలో గిరిజన జనాభా ప్రాతిపదికన 10 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి అవకాశాల్లోనూ గిరిజన యువతీ, యువకులకు రిజర్వేషన్లను అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వనదేవతలు సమ్మక్క, సారలమ్మల దర్శనం చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణకు గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయ నిర్మాణానికి తొలి విడతగా దాదాపు రూ.900 కోట్లను కేటాయించడంతో పాటుగా, విశ్వవిద్యాలయానికి సమ్మక్క, సారక్క పేరును పెట్టిన ప్రధానమంత్రికి గిరిజన సమాజం తరపున, తెలంగాణ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
దేశవ్యాప్తంగా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు, గిరిజన వీరుల త్యాగాలను యావద్భారతం స్మరించుకునేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్బంగా గిరిజనుల సంక్షేమం కోసం కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. హైదరాబాద్లో రూ. 25 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజన స్మారక మ్యూజియం నిర్మాణం చేపట్టబోతున్నదని, 6.5 కోట్ల కేంద్ర నిధులతో గిరిజన పరిశోధన సంస్థ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. ములుగు జిల్లాలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో విద్యారంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ వర్గాల్లో అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యంతో రూ.420 కోట్లతో 17 కొత్త ఏకలవ్య పాఠశాలలను కేంద్రం ఏర్పాటుచేసిందని అన్నారు.
ఇవే కాకుండా గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను యాస్పిరేషనల్ డిస్ట్రిక్టస్ (అత్యంత వెనుకబడిన జిల్లాలు)గా గుర్తించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించిందని అన్నారు. రాష్ట్రంలోలో భూపాలపల్లి, ఆసిఫాబాద్, భదాద్రి-కొత్తగూడెం జిల్లాల కోసం 37 కోట్లు విడుదల చేసిందని అన్నారు. గిరిజనుల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని, స్వదేశ్ దర్శన్ పథకం కింద ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతాలను కలుపుతూ గిరిజన సర్క్యూట్ పేరుతో ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను కల్పించామని అన్నారు. ఇందుకోసం రూ.80 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్,ఎంపీ గరికపాటి మోహనరావు,మాజీ మంత్రి,జగన్నాయక్,ఏనుగుల రాకేష్ రెడ్డి,బిజెపి ములుగు జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి,ములుగు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్,రాజు నాయక్,అన్ని మండలాల అధ్యక్షులు,కార్యకర్తలు పాల్గొన్నారు.





