• ఇది కొనసాగాలంటే ప్రజలంతా ఏకం కావాలి
• ఇరిగేషన్ కార్పోరేషన్ ఛైర్మన్ డాక్టర్ ఎస్. వేణుగోపాలాచారి
హైదరాబాద్,సెప్టెంబర్11: తెలంగాణ అభివృద్దిని కాంక్షిస్తున్న ప్రజలు మరోమారు కెసిఆర్ సిఎం కావాలని కోరుకుంటున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా కెసిఆర్ హ్యాట్రిక్ విజయం తప్పదని మాజీ కేంద్రమంత్రి, ఇరిగేషన్ కార్పోరేషన్ ఛైర్మన్ డాక్టర్ ఎస్. వేణుగోపాలాచారి అన్నారు. రానున్న ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ పథకాలు రూపొందించారన్నారు. వ్యవసాయాన్ని ఒక పండుగలుగా మార్చారన్నారు. ఉచితంగా గొర్రెలను పంపిణీ చేసి.. గొల్ల కురుమల సంక్షేమానికి కృషి చేశారని ప్రశంసించారు. మాంసం ఉత్పత్తిలోనూ తెలంగాణ నంబర్ వన్ గా ఉందన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలతో పాలన చేరువైందని, ప్రజల చెంతకే అభివృద్ధి, సంక్షేమం అందుతున్నదని పేర్కొన్నారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి అన్నిహంగులతో కలెక్టరేట్లతో పాటు ఆఫీసు సముదాయాలను నిర్మించామన్నారు.
కొత్త జిల్లాలతోపాటు అవసరమైన చోట రెవెన్యూ డివిజన్లు, మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసిన గొప్ప పాలనా దక్షకుడు అని కొనియాడారు. వాటి ఫలాలు మన కండ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ప్రతి గ్రామం, పట్టణాలలో జరిగిన అభివృద్ధే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రజావసరాలకు అనుగుణంగా పంచాయతీ రాజ్, నీటి పారుదల, రోడ్లు భవనాల, మిషన్ భగీరథ శాఖలను విస్తరించడం జరిగిందన్నారు. పనిచేసే సర్కారును ఆదరించాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసి కెసిఆర్ను దీవించాలని విజ్ఞప్తి చేశారు. రాష్టాన్న్రి అగ్రగామిగా నిలుపుతున్న కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా గెలిపించుకోవాలని కోరారు. అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేలేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి కండ్లముందు కనిపిస్తున్నదని చెప్పారు.
ఉద్యమ కాలంలో ఇచ్చిన హా మేరకు నీళ్లు, నిధులు, నియామకాలు ఇక్కడి వారికి అందించడంలో సఫలీకృతులయ్యారన్నారు. మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి బీడు భూములకు గోదావరి జలాలను మళ్లించారన్నారు. మిషన్ భగీరథతోతాగునీటి కష్టాలు తీర్చారని చెప్పారు. సంక్షేమ ఫలాలు అందించడంతో పేదలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగ యువత ఆనందంగా ఉన్నదని చెప్పారు. పేదల అభ్యున్నతి కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా, రైతాంగం మేలు కోసం రైతుబంధు, రైతుబీమా లాంటి స్కీంలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మన రాష్టాన్న్రి అభివృద్ధిలో ఆదర్శంగా తయారు చేశారని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మితే అధోగతి పాలుకాకతప్పదన్నారు. పార్టీలో కొత్త, పాత లేకుండా అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.




