హైదరాబాద్, ప్రజాతంత్ర: రాష్ట్ర నూతన సచివాలయం అందంగా రూపుదిద్దుకుంటుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సచివాలయాన్ని కొద్ది నెలల్లోనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టిన విషయం తెలిసిందే. 50-200 ఏండ్ల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా సెక్రటేరియట్ను నిర్మిస్తున్నారు. దీనికోసం అధికారులు, నిర్మాణ సంస్థ ప్రత్యేక దృష్టి సారించాయి.
చాంబర్ల నిర్మాణం, ఇంటీరియర్ డిజైన్, ఎలక్టిక్రల్, ప్లంబింగ్, వర్క్స్టేషన్ ఏర్పాటు, కలరింగ్, ఫ్లోరింగ్, మార్బుల్స్, పోర్టికోల నిర్మాణం.. ఇలా వివిధ రకాల పనులన్నీ ఏకకాలంలో చేపడుతున్నారు. మూడు షిప్ట్లలో కలిపి దాదాపు వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. ప్లడ్ లైట్ల వెలుగులోనూ పనులు జరుగుతున్నాయి. రూ.617 కోట్లతో నిర్మితమవుతున్న నూతన సచివాలయ భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో నిర్మిస్తున్నారు. నూతన సచివాలయ భవనంలోకి సహజమైన గాలి, వెలుతురు వొచ్చేలా నిర్మిస్తున్నారు.




