అజాగ్రత్తగా ఉంటే వోటే కాటేస్తుంది

  • కాంగ్రెస్‌ ‌మళ్లీ కొత్త రూపంలో వొస్తున్నది జాగ్రత్త
  • యాభై ఏండ్ల కాంగ్రెస్‌.. ‌పదేండ్ల బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాల పనితీరును బేరీజు వేయాలిసం
  • క్షేమంలో దేశంలోనే నంబర్‌ ‌వన్‌గా తెలంగాణ
  • కారు గుర్తుకు వోటేసి పద్మా దేవేందర్‌ ‌రెడ్డిని గెలిపించండి
  • మెదక్‌ ‘‌ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్‌  

మెదక్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 15 : ఆలోచించి వేయకుంటే వోటే కాటేసే అవకాశం ఉంటదని సిఎం కెసిఆర్‌ ‌ప్రజలను హెచ్చరించారు. ఎలక్షన్లు వొచ్చినయంటే అబద్ధాలు చెప్పడం..అభాండాలు వేయడం..ఇష్టమొచ్చిన వాగ్ధానాలు, ప్రచారాలు చేయడం, జనాన్ని మోసం చేసే పరిస్థితి నడుస్తుంటదని సీఎం కేసీఆర్‌ అన్నారు. బుధవారం మెదక్‌లో జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో పాల్గొన్న కేసీఆర్‌ ‌ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ…75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య పరిణతి ఇంకా రాలేదని, ఎన్నికల్లో అభ్యర్థుల గుణగణాలతో పాటుగా వారి వెనుకున్న పార్టీల గత చరిత్రను కూడా చూడాలని సూచించారు. ఇక్కడే ఏ ఎమ్మెల్యే గెలిస్తే..హైదరాబాద్‌లో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తదని, తెలంగాణ రాష్ట్ర సాధన, ప్రజల హక్కుల కోసమే బీఆర్‌ఎస్‌ ‌పుట్టిందని, యాభై ఏండ్ల కాంగ్రెస్‌..‌పదేండ్ల బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాల పనితీరును బేరీజు వేసి వోటేయాలని అన్నారు. తెలంగాణ వొచ్చిన్నాడు కరెంటు, తాగునీరు, సాగునీరు లేదని, రైతుల ఆకలి చావులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు..అంతా గందరగోళంగా ఉండేదని, పదేండ్లలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఒక్కొక్కటిగా సరిచేస్తూ నేడు సంక్షేమంలో తెలంగాణ ఇండియాలోనే నంబర్‌ ‌వన్‌ ‌నిలిచిందని, మనకు సాటి కూడా ఎవరూ లేరని స్పష్టం చేశారు.

రైతులకు నీటి తీరువా బకాయిలను రద్దు చేసినామని, నీళ్ల ట్యాక్స్ ‌లేకుండా చేశామని, 24 గంటల నాణ్యమైన కరెంటును ఉఃచితంగా ఇస్తున్నామని, పెట్టుబడిగా రైతు బంధు ఇస్తున్నామని, కొంత నష్టమొచ్చినా పంట కొనుగోలు చేసి డబ్బులు ఇస్తున్నామని కెసిఆర్‌ ‌వివరించారు. కేసీఆర్‌కు ఏం పనిలేదు..ప్రజల పన్నులన్నీ దుబారా చేసి రైతు బంధు ఇస్తున్నడని కాంగ్రెస్‌ ‌నాయకులు అంటున్నరని, పద్మా దేవేందర్‌ ‌రెడ్డిని గెలిపిస్తే రైతు బంధు ఉండడమే కాకుండా క్రమంగా అయిదేళ్లలో రూ.16 వేలకు పెరుగుతదన్నారు. రైతులకు 24 గంటల వేస్ట్..‌కేసీఆర్‌ ‌డబ్బులన్నీ వేస్ట్ ‌చేస్తున్నడని మరో కాంగ్రెస్‌ ‌నాయకుడంటడని, పిసిసి అధ్యక్షుడు 3 గంటల కరెంటు చాలు..దాని కోసం 10 హెచ్‌పి.మోటార్‌ ‌పెట్టాలంటడని, రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మోటార్లు ఉన్నయని, మరి వాటిని కొనాలంటే డబ్బులు ఎవరిస్తరని కెసిఆర్‌ ‌ప్రశ్నించారు.  రైతుల వాడేదే 3 లేదా 5 హెచ్‌.‌పి.మోటార్లని తెలిపారు. కాంగ్రెస్‌ ‌నేత రాహూల్‌ ‌గాంధీ ధరణిని తీసేసి బంగాళాఖాతంలో వేస్తామంటున్నడని, రైతుబంధు, రైతుబీమా, పంట కొనుగోలు డబ్బులు ధరణి ద్వారానే రైతుల అకౌంట్లలో డబ్బులు పడుతున్నయని,  ధరణిని తీసేస్తే మళ్లీ దలారులు, పైరవీకారులు, అధికారుల రాజ్యమే వొస్తదని కెసిఆర్‌ అన్నారు.

మీకు తెలుసా కేసీఆర్‌..‌మా కర్ణాటకలో 5 గంటల కరెంటు ఇస్తున్నమని అక్కడి కాంగ్రెస్‌ ‌నాయకుడు అంటడని, మన దగ్గర 24 గంటల కరెంటునిస్తున్నం గదా..మరి నవ్వాల్నా..ఏడ్వాల్నా..అర్థమైతలేదన్నారు. రాజకీయాలను సులభంగా తీసుకోవద్దని, వోటును సులభంగా వేయొద్దని, ఇదేం మ్యాట్నీ సినిమా కాదు…అజాగ్రత్తగా ఉంటే వోటే కాటేస్తదని కెసిఆర్‌ ‌సూచించారు. రామాయంపేటకు ఆర్డీవో ఆఫీసు, డిగ్రీ కాలేజీ జీవో వొచ్చిందంటే పద్మా దేవేందర్‌ ‌రెడ్డి వల్లనేనని, నాడు మంజీరా నదిని కాంగ్రెస్‌ ‌పార్టీ ఎండబెడితే దుమ్ములేచిందని, మహబూబ్‌ ‌నగర్‌, ‌ఫతే నగర్‌ ‌కాలువల్లో చెట్లు, గడ్డి మొలిచింది కదా. మనం బ్రహ్మండంగా మంచిగ చేసుకున్నమని, గణపురం ఆనకట్ట కింద  40 వేల ఎకరాల్లో పంట పండుతున్నదని అని కెసిఆర్‌ అన్నారు.  నీళ్లు రాని ఏరియాల్లో నీళ్లను తీసుకొచ్చే బాధ్యత తనదని, 58 ఏండ్లు మనల్ని గోస పెట్టి, మన పిల్లల్ని కాల్చి చంపిన కాంగ్రెస్‌ ‌మళ్లీ కొత్త రూపంలో వొస్తున్నది జాగ్రత్త అంటూ సలహా ఇచ్చారు. తలసరి ఆదాయంలో భారతదేశంలో తెలంగాణయే నంబర్‌ ‌వన్‌ అని, తలసరి విద్యుత్‌ ‌వినియోగంలో తెలంగాణయే నంబర్‌ ‌వన్‌ అని, ప్రజల మధ్యలో 24 గంటలు ఉండి పనిచేసే పద్మాదేవేందర్‌ ‌రెడ్డి గెలిస్తే రింగురోడ్డుతో పాటు అన్నీ మీ ముందుకే వొస్తయన్నారు కెసిఆర్‌. ‌మేనిఫెస్టోలో పెట్టుకున్నవన్నీ చేసుకుంటామని, పద్మా దేవేందర్‌ ‌రెడ్డికి, కాంగ్రెస్‌ అభ్యర్థికి ఏమన్నా పోలిక ఉన్నదా అంటూ..కారు గుర్తకు వోటేసి పద్మా దేవేందర్‌ ‌రెడ్డిని గెలిపిస్తే, ప్రజల బాధలన్నీ తీర్చే బాధ్యత తనదని సీఎం కేసీఆర్‌ ‌హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *