- దిల్లీలో శ్రద్దాంజలి ఘటిచిన రాష్ట్రపతి, ప్రధాని
- హైదరాబాద్లో నివాళి అర్పించిన మంత్రి కిషన్ రెడ్డి
న్యూ దిల్లీ, డిసెంబర్ 6 : మహా పరినిర్వాన్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ తదితరులు డా.బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులర్పించారు. బాబాసాహెద్ అంబేద్కర్ వర్థంతి నేపథ్యంలో న్యూ దిల్లీలోని పార్లమెంట్ హౌస్ లాన్స్లో ప్రధాని మోడీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్ కర్, స్పీకర్ ఓం బిర్లా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు.మన దేశానికి ఆయన చేసిన ఆదర్శప్రాయమైన సేవను స్మరించుకుంటున్నానని, అంబేద్కర్ పోరాటం వల్ల లక్షలాది మందిలో ఆశ చిగురించాయని ప్రధాని ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.
భారత దేశానికి రాజ్యాంగాన్ని అందించడానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని కొనియాడారు. మనందరం సమానమని, మనందరం భారతీయులమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. వీటన్నింటికీ విరుద్దమైన వాటిని బాబాసాహెబ్ ఆమోదించరని, ఆయన బాటలో నడిచే మనకు కూడా ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కు నివాళి అర్పిస్తూ పోస్ట్ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళి అర్పించారు.
కొంతమంది ముఖ్యమంత్రులు రాజ్యాంగం మార్చాలనే కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగం పనికిరాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న కిషన్ రెడ్డి.. రాజ్యాంగం అనుసరించే మోడీ పరిపాలన కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. పంచతీర్థ పేరుతో అంబేద్కర్ కు సంబందించిన స్థలాలన్నీ అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ స్థలాలు సందర్శించడానికి పంచతీర్థ పేరుతో ఏప్రిల్ 14న కొత్త రైలు ప్రారంభిస్తున్నామని చెప్పారు.



