- జాతీయ డ్యామ్ సేఫ్టీ సంస్థ నివేదికలో తీవ్రమైన అంశాలు
- రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వొచ్చి సిబిఐ విచారణకు అంగీకరించాలి
- ఈటల, లక్ష్మణ్లతో కలిసి మేడిగడ్డ డ్యామ్ను పరిశీలించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 4 : లక్ష కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ అంధకారంగా మారిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శనివారం కుంగిన మేడిగడ్డ డ్యామ్ను బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, ఎంపీ లక్షణ్ పరిశీలించారు. అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ…నాణ్యత, నిర్మాణ లోపంతో మేడిగడ్డ బ్యారేజ్కు పగుళ్లు ఏర్పడి దెబ్బతిందని తెలిపారు. ఈ ఘటన తెలియడంతోనే కేంద్ర జలశక్తి నిపుణులకు లేఖ రాయడం జరిగిందని..జాతీయ డ్యామ్ సేఫ్టీ అధికారులు వొచ్చి ఇచ్చిన నివేదికలో చాలా తీవ్రమైన అంశాలు పొందుపరిచారని ఆయన చెప్పారు.
నాణ్యత లోపం వ్లనే అన్నారం బ్యారేజీ కింద పియర్స్ నుంచి వాటర్ వృథాగాపోతుందన్నారు. ప్రాజెక్టులో ఒక్క టీఎంసీ నీరు కూడా నిల్వలేదన్నారు. వేలకోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని అన్నారు. రాష్ట్ర ప్రజలు, ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని..ప్రాజెక్టు నిర్మాణం శాస్త్రీయబద్ధంగా లేదన్నారు. సీఎం కేసీఆర్ ఇంజనీరుగా అవతారమెత్తి, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించడంతో ఈ దుస్థితి వొచ్చిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ప్రాజెక్టు గుదిబండగా మారిందన్నారు. రైతులకు ఈ ప్రాజెక్టు వల్ల ఏ ఉపయోగం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వొచ్చి సీబీఐ దర్యాప్తుకు అంగీకరించాలన్నారు. లక్షల కోట్ల ప్రజాధనం గోదావరి పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు 20 అంశాలపైన డాటా అడిగితే రాష్ట్ర ప్రభుత్వం 11 అంశాలపైనే నివేదిక ఇచ్చిందని కిషన్రెడ్డి వెల్లడించారు.




