- పేరుకు పోయిన ఉపగ్ర వ్యర్థాలు
- ఇస్రో అద్యయనంలో వెల్లడి
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్,ఆగస్ట్7:: సువిశాలాకాశంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అంతరిక్షంలో ఉపగ్రహాలకు చెందిన వ్యర్దాలుఎక్కువయ్యాయి. ఇస్రో దీనిపై ఇటీవల ఓ స్టడీ చేసింది. స్పేస్లో దాదాపు 27వేల వస్తువులు ఉన్నట్లు గ్రహించింది. దీంట్లో 80 శాతం వరకు ఉపగ్రహ శిథిలాలే ఉంటాయని ఇస్రో పేర్కొన్నది. 10 సెంటీటర్ల కన్నా తక్కువ సైజ్లో ఉన్న వస్తువులు దాదాపు లక్షల సంఖ్యలో ఉంటాయని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. యాంటీ శాటిలైట్ పరీక్షల ద్వారా ఏర్పడిన అంతరిక్ష వ్యర్దాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు ఇస్రో అంచనా వేసింది. చైనా, అమెరికా, ఇండియా, రష్యాకు చెందిన పరీక్షల వల్ల ఆ వ్యర్దాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. అంతరిక్షంలో వ్యర్దాలన్నీ జామ్ కావడం వల్లే.. జూలై 30వ తేదీన నిర్వహించిన పీఎస్ఎల్వీ పరీక్ష ఆలస్యమైందని ఇస్రో పేర్కొన్నది.
శ్రీహరికోటపై ఉన్న అంతరిక్ష ప్రాంతంలో వ్యర్దాలు చాలా ఉన్నాయని, అందుకే రాకెట్ ప్రయోగాన్ని ఒక నిమిషం ఆలస్యంగా నిర్వహించామని ఇస్రో చీఫ్ తెలిపారు. ఉదయం 6.30 నిమిషాలకు చేపట్టాల్సిన ప్రయోగాన్ని.. ఉదయం 6.31 నిమిషాలకు చేపట్టామన్నారు. 500 కిలోటర్ల దూరంలో ఉన్న భూకక్ష్యలో స్పేస్ వస్తువులు జామైనందు వల్లే ఆ ప్రయోగం ఆలస్యం జరిగిందని సోమనాథ్ తెలిపారు. యూఎస్ స్పేస్ కమాండ్ అంచనా ప్రకారం 10 సెంటీటర్ల సైజు కన్నా పెద్ద సైజులో 26,783 అంతరిక్ష వ్యర్దాలు ఉన్నట్లు తెలుస్తోంది. 40 శాతం స్పేస్ వ్యర్దాలు అమెరికాకు చెందినవే ఉన్నాయి. ఇక రష్యాకు చెందినవి 28 శాతం, చైనాకు చెందినవి 19 శాతం ఉన్నట్లు ఇస్రో తన రిపోర్టులో తెలిపింది. ఇండియా వల్ల ఏర్పడిన అంతరిక్ష వ్యర్దాలు 217 వస్తువులు మాత్రమే, అంటే అది కేవలం 0.8 శాతం మాత్రమే అని ఇస్రో తన రిపోర్టులో వెల్లడించింది.




