– పాక్ రక్షణ మంత్రి ఖవాజా వ్యాఖ్యలకు కౌంటర్
- రెచ్చగొట్టే ప్రకటనలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
న్యూదిల్లీ, ఏప్రిల్ 7 : పాకిస్థాన్కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్పై కన్నేస్తే ఈసారి పాక్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలంటూ హెచ్చరించారు. భవిష్యత్తులో భారత్ ఏమైనా దాడులకు పాల్పడితే కోల్కతాను లక్ష్యంగా చేసుకుంటామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల కవ్వింపులకు పాల్పడ్డారు. కోల్కతాపై దాడి చేస్తామన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలను ఆయన చేయకుండా ఉండాల్సిందని అన్నారు. ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లనే 55 ఏళ్ల క్రితం పాక్ రెండుగా విడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడింది. నాడు బంగ్లా విముక్తి పోరాటానికి భారత సైన్యం అండగా నిలిచిందంటూ ఉద్రిక్తతలను పెంచే ప్రకటనలు చేయవద్దని ఇస్లామాబాద్ను ఆయన హెచ్చరించారు. వారు బెంగాల్పై కన్నేస్తే ఈసారి పాక్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలని వ్యాఖ్యానించారు. ఖవాజా ఆసిఫ్ గత శనివారం నోరుపారేసుకోగా దీనిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ, ఎంపీ అబిషేక్ బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. కోల్కతాపై దాడి చేస్తామని బహిరంగంగా బెదిరించినా ఖవాజా ఆసిఫ్ ప్రకటలను ఖండించే ధైర్యం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షాకు లేకుండా పోయిందని అభిషేక్ బెనర్జీ విమర్శించారు. ఒక ఔన్సు ధైర్యం ఉన్నా కేంద్ర బలగాలకు, బీఎస్ఎఫ్, ఇండియన్ ఆర్మీకు పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి పట్టుకునేందుకు స్వేచ్ఛనివ్వాలన్నారు. మోదీ, అమిత్, రాజ్నాథ్ సింగ్కు ఆ సాహసం ఉందా అని ప్రశ్నించారు. మమతా బెనర్జీ సైతం కోల్కతాపై దాడి చేస్తామన్న పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. భారత్ స్పందన తీవ్రంగా ఉంటుందని ఆయన ఎందుకు హెచ్చరించలేకపోతున్నారని నిలదీశారు. ప్రధాని రాజీనామాకు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ తాజాగా స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



