– స్వాతి నక్షత్రం సందర్బంగా గిరి ప్రదక్షిణ
-ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 1: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కవచమూర్తుల అష్టోత్తర శత కలశాభిషేకం జరిపారు. ముందుగా ఆలయంలో 108 కలశాలకు పూజలు జరిపించారు. పంచసూక్త పఠనంతో హోమం నిర్వహించి ఉత్సవమూర్తులను, ప్రతిష్ఠ అలంకారమూర్తులను అభిషేకించారు. తులసీ దళాలతో సహస్రనామార్చన చేశారు. వైకుంఠ ద్వారం (మెట్లదారి) వద్ద ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా స్థానికులు వందలాదిమంది భక్తులతో కొండ చుట్టూ నారసింహుని నామస్మరణతో జైనరసింహ, లక్ష్మీనారసింహ గిరి ప్రదక్షిణ చేపట్టారు. స్వాతి నక్షత్రమున గిరిప్రదక్ష్షిణ చేయుట వల్ల దుష్ట గ్రహ, వ్యాధి, గ్రహ ప్రయోగ బాధ నివారణ, గ్రహ దోష నివారణ, సంతానార్ధులకి సంతానం, వివాహం కాని వారికి వివాహరు ఏయే అంశాలతో భక్తులు ఇబ్బంది పడుతున్నారో వారు ఓం శ్రీ లక్ష్మీనారసింహాయ నమః అను నామస్మరణలతో గిరి ప్రదక్షణ చేస్తే వారికి స్వామి వారి అనుగ్రహంతో సమస్త కోరికలు నెరవేరి గిరి ప్రదక్షిణ ఫలము పొందుతారని విశ్వాసం.



