– వ్యాధి లక్షణాలు గుర్తించి చికిత్స తీసుకోండి
– ఉచితంగా వైద్యం అందిస్తోన్న ప్రభుత్వం
– నాపా ప్రతినిధుల అవగాహన కార్యక్రమం అభినందనీయం
– వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: క్షయ వ్యాధిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హెచ్చరించారు. ఇది సమాజానికి పట్టిన చీడ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాధి నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నా మళ్లీ ఇది విజృంభించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. క్షయ లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తోందని అన్నారు. అంతర్జాతీయ క్షయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి మాట్లాడారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలన్నారు. లేకుంటే ఒకరి నుంచి మరొకరికి ఇది వ్యాప్తి చెంది సమాజానికి సవాల్ గా మారుతుందన్నారు. హైదరాబాద్లో యువ పల్మనాలజిస్టులు చేపట్టిన చైతన్య కార్యక్రమాన్ని మంత్రి అభినందించారు. ప్రతి ఒక్కరూ ఇలా చైతన్యం చేయడానికి ముందుకు రావాలన్నారు. ఈ క్రమంలో సామాజిక బాధ్యతగా గుర్తించిన యువ వైద్యులు ఓ బృందంప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, చైతన్యం చేయడానికి పూనుకున్నారు. హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తు ప్రచార కార్యక్రమాలకు దిగారు. మంగళవారం ప్రపంచ టిబి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజల్లో చైతన్యం కోసం వాకథాన్ నిర్వహించారు. ఆదివారం సంజీవయ్యపార్క్లో నిర్వహించిన వాకథాన్తో పాటు మంగళవారం కెబిఆర్ పార్క్లో కూడా దీనిని నిర్వహించారు. న్యూ ఏజ్ పల్మనాలజిస్టస్ అసోసియేషన్ కోర్ కమిటీ నాపా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. ఇందులో ప్రముఖ పల్మనాలజిస్టు డాక్టర్లు డా. అంకిత్ కోట్ల, డా. వివేక్ వర్ధన్ వీరపనేని,డా. బి.అనిరుధ్, డా. రోహిత్ రెడ్డి,డా. గోవర్ధన్ రెడ్డి, డా. కె. ప్రశాంత్ ,డా. ఉపేంద్ర, డా. ఓబుల్ రెడ్డిలు ఉన్నారు. వీరంతా కలసి ఈకార్యక్రమం ద్వారా ప్రజాచైతన్యం కోసం వాకథాన్ మంగళవారం కెబిఆర్ పార్క్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సీనియర్ పల్మనాలజిస్టు డాక్టర్లు డా. విష్ణున్ రావు వీరపనేని, డా. సుధాకర్ కంది,డా. టిఎల్ఎన్ స్వామి,డా. దయానంద్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల మరణాలతో 1.04 కోట్ల కొత్త కేసులు నమోదైనవి అని నివేదించిందని అన్నారు. అవగాహనను పెంచడానికి, ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని 1982 నుండి ప్రతి సంవత్సరం మార్చి 24న జరుపుకుంటున్నామని అన్నారు. తమ బాధ్యతగా నాపా ప్రతినిధులంతా కలసి ప్రజలను చైతన్యం చేసేందుకు ముందుకు వచ్చామని నాపా ప్రతినిధి డాక్టర్ వివేక వర్థన్ వీరపనేని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.
—————————————————————————————————————————————————————————————————