“కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లన్నిటిలోకూడా తెలంగాణపైన సవతితల్లి ప్రేమనే కనబర్చిందన్న అపనింద ఉంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి విభజన ఒప్పందాలను పదేళ్ళుగా కేంద్రం నెరవేర్చడం లేదు. గతంలో ఇచ్చిన హామీలతోపాటు, కొత్తగా అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళికలకు తగినట్లు నిధులను ఈ బడ్జెట్లో కేంద్రం ఏమేరకు సమకూరుస్తుందన్నది పెద్ద ప్రశ్నగానే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ రివర్ ఫ్రంట్, రాష్ట్ర రాజధానిలో మెట్రోరైలు విస్తీరణకు సంబంధించి నిధుల విషయంలో ఇప్పటికే అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తులు చేయడమైంది. అలాగే రాజధానిలో నాల్గవ సిటీ ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు సహకరించాలని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, త్రిపులార్ ఇలా పదుల సంఖ్యలో ఉన్న విజ్ఞప్తుల జాబితాలో కేంద్రం ఎన్నిటిని పరిగణలోకి తీసుకుంటుందన్నది రేపటి బడ్జెట్లో తేలనుంది..”
కేంద్ర బడ్జెట్పై వేతన జీవుల ఆశలు- వ్యవసాయరంగానికి పెద్ద పీట ?
( మండువ రవీందర్రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )
కేంద్రం ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్న బడ్జెట్పైన వేతన జీవులు ఎంతో అశపెట్టుకున్నారు. ఆదాయపు పన్ను తగ్గింపు, పొదుపు పైన ప్రోత్సాహకాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు. కనీసం పది లక్షల రూపాయల ఆదాయం పైన పన్ను మినహాయింపును మధ్య తరగతి ఆదాయ వర్గాలవారు కోరుతున్నారు. గత బడ్జెట్ తమను తీవ్ర నిరాశకు గురిచేసిందంటున్న ఆ వర్గాలు ఈసారైన కేంద్రం తమకు కొంత వెసులుబాటును కలిగిస్తుందనుకుంటున్నారు. 2025-26కు సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామ్ ఫిబ్రవరి ఒకటిన ప్రవేశబెట్టబోతున్నారు. వాస్తవంగా ఈసారి బడ్జెట్ సెషన్ ఈనెల 31 నుండే ప్రారంభకానుంది. ఈ సమావేశాలు రెండు విడతలుగా నిర్వహించే అవకాశముంది.
మొదటి విడత సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుండగా, మొదటి రోజున లోక్ సభ, రాజ్యసభ ఉమ్మడి సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. అనంతరం ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామ్ 2025-26 బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తర్వాత వరుసగా దీనితో ఎనిమిదవసారి ఆమె యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ మూడవసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ఇదే కావడంతో దేశవ్యాప్తంగా సామాన్యులు మొదలు బడా వ్యాపార దిగ్గజాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగానే ఈసారి బడ్జెట్ ఉండే అవకాశముంటుందని భావిస్తున్నారు. వేతన జీవులు, రైతులు, కార్మికులు ఈ బడ్జెట్లో కేంద్రం ఎలాంటి మార్పులు చేయనుందన్న విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు ఈ బడ్జెట్ కళ్ళెంవేసేదిగా ఉండాలని యావత్ దేశప్రజలు ఆశిస్తున్నారు.
అలాగే ఈ బడ్జెట్ వ్యవసాయరంగానికి పెద్దపీట వేసే అవకాశముందనుకుంటున్నారు. కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టినప్పటి నుండి ఈ రంగం అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నది. దేశవ్యాప్తంగా రైతాంగం వివిధ సమస్యలపై నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఆందోళనలు చేస్తునే ఉన్నారు. దేశ రాజధాని సరిహద్దుల్లోని పంజాబ్, హర్యాన రైతాంగం సంవత్సరాల తరబడి నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. తాము పండించిన పంటకు మద్దతు ధరను ప్రకటించాలంటూ రైతాంగం డిమాండ్ నిత్యకృత్యంగా మారింది. తక్కువ వడ్డీరేటుకు రుణాలను అందించాలంటున్నారు. దేశ జనాభాలో దాదాపు 45 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారు. ఈ రంగాన్ని నమ్ముకుని బతుకుతున్న భూమిలేని నిరుపేదల సంఖ్య కూడా తక్కువేమీ లేదు. దేశానికి వెన్నెముకగా చెబుతున్న రైతాంగాన్ని కాపాడుకునేందుకు కేంద్రం ఈ బడ్జెట్లో వారి సంక్షేమానికి ప్రత్యేక కేటాయింపులు చేయవొచ్చనుకుంటున్నారు.
అలాగే మధ్యతరగతి వారి పైన ధరల భారం పడకుండా వాటిని నియంత్రించే చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నారు. గృహనిర్మాణ రుణాలపైన అధిక వడ్డీని తగ్గించాలన్న డిమాండ్ చాలాకాలంగా ఆ తరగతి వారినుండి వొస్తున్నది. నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద మినహాయింపును 50వేల నుండి లక్ష రూపాయలకు పెంచాలన్నది కూడా మరో డిమాండ్ ఉంది. ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించే విధంగా మరిన్ని మినహాయింపులనివ్వాలని మరోపక్క సీనియర్ సిటిజన్స్ కోరుతున్నారు. ఇదిలాఉంటే నిర్మలా సీతారామ్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై పలువురు ఆర్థికవేత్తలు తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఏఏ వస్తువులపై పన్నుల భారం పడనుంది, ఏ వస్తువు ధరలు తగ్గే అవకాశముందన్న విషయాలను వెల్లడిస్తున్నారు. డాలర్కు రూపాయి విలువ తగ్గటం, ద్రవ్యోల్బణం పెరగటం, జీడీపి ఆశాజనకంగా లేకపోవడం లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే.. విదేశాలనుండి దిగుమతిచేసుకునే టివి, మెబైల్ లాంటి ఎలక్ట్రికల్ పరికరాల ధరలో భారీగా మార్పులు జరిగే అవకాశముందంటున్నారు. క్రూడాయిల్ సంబంధిత వస్తువులు, పెట్రోల్, డిజిల్ ధరలు మరింత పెరిగే అశాకాశంలేకపోలేదంటున్నారు. అయితే దేశంలో సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న తరణంలో సోలార్ వినియోగ వస్తు ధరలు తగ్గే అవకాశముందంటున్నారు.
రైతాంగం ప్రదర్శిస్తున్న నిరసననుండి బయటపడేందుకు వ్యవసాయరంగానికి ఈసారి బడ్జెట్లో పెద్దపీట వేసేదిగా ఉండే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అందుకే అగ్రిసెక్టార్కు సంబంధించి కేంద్రం పలు నిర్ణయాలు ప్రకటించవొచ్చు. ఆ రంగంలోని యంత్ర సామగ్రీపైన పన్నులను తగ్గించవొచ్చనుకుంటున్నారు. అలాగే ఫార్మా రంగానికి కూడా ప్రాధాన్యం ఇస్తుంది. ప్రధానంగా లోకల్ ఫార్మారంగంలోని ఉత్పత్తులపై పన్నులను తగ్గించవొచ్చు.
ఈసారైనా తెలంగాణకు న్యాయం జరుగుతుందా…
కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లన్నిటిలోకూడా తెలంగాణపైన సవతితల్లి ప్రేమనే కనబర్చిందన్న అపనింద ఉంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి విభజన ఒప్పందాలను పదేళ్ళుగా కేంద్రం నెరవేర్చడం లేదు. గతంలో ఇచ్చిన హామీలతోపాటు, కొత్తగా అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళికలకు తగినట్లు నిధులను ఈ బడ్జెట్లో కేంద్రం ఏమేరకు సమకూరుస్తుందన్నది పెద్ద ప్రశ్నగానే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ రివర్ ఫ్రంట్, రాష్ట్ర రాజధానిలో మెట్రోరైలు విస్తీరణకు సంబంధించి నిధుల విషయంలో ఇప్పటికే అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తులు చేయడమైంది. అలాగే రాజధానిలో నాల్గవ సిటీ ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు సహకరించాలని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, త్రిపులార్ ఇలా పదుల సంఖ్యలో ఉన్న విజ్ఞప్తుల జాబితాలో కేంద్రం ఎన్నిటిని పరిగణలోకి తీసుకుంటుందన్నది రేపటి బడ్జెట్లో తేలనుంది.





