– రూ.90వద్ద కనిష్ఠానికి పడిపోయింది
– నష్టాల బాటలో సాగిన సూచీలు
న్యూదిల్లీ, డిసెంబర్ 2: రూపాయి విలువ మరింతగా దిగజారింది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ రూ.90 వద్ద రికార్డు కనిష్టానికి పడిపోవడం మదుపర్లను కలవరపెట్టింది. దీంతో సూచీలకు వరుసగా రెండో రోజు కూడా నష్టాలు తప్పలేదు. రోజంతా సూచీలు నష్టాల బాటలోనే సాగాయి. సోమవారం విదేశీ మదుపర్లు రూ.1, 171 కోట్ల విలువైన షేర్లను అమ్మేయడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. అలాగే ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత ఇప్పట్లో ఉండదనే అంచనాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం సూచీలను వెనక్కి లాగాయి. దీంతో ఈ రోజు సెన్సెక్స్, నిప్టీ నష్టాలతో రోజును ముగించాయి..గత సెషన్ ముగింపు (85, 6416)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 300 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత ఆ నష్టాలు మరింత పెరిగాయి. నెగిటివ్ వార్తల కారణంగా చివర్లో అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్ భారీగా నష్టపోయింది. చివరకు సెన్సెక్స్ 503 పాయింట్ల నష్టంతో 85, 138 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిప్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 143 పాయింట్ల నష్టంతో 26, 032 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్లో ఆసియన్ పెయింట్స్, హిటాచీ ఎనర్జీ, మదర్సన్, వోడాఫోన్ ఐడియా, లగెన్మార్క్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి. ఇండియన్ బ్యాంక్, నవుమా హెల్త్కేర్, ఎన్బీసీసీ, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, అదానీ ఎనర్జీ మొదలైన షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిప్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 132 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిప్టీ 407 పాయింట్లు కోల్పోయింది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.87గా ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





