– బీఆర్ఎస్, బీజేపీలకు అధికారం కల్ల
– నాగర్ కర్నూలు కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్
నాగర్ కర్నూల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే సైనికుల్లా పని చేయాలని పార్టీ కార్యకర్తలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీలు అధికారంలోకి రావని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కావాలని బావాబామ్మర్దులు హరీశ్ రావు, కేటీఆర్ కొట్లాడుకుంటున్నారని విమర్శించారు. నాగర్ కర్నూల్లో కొత్తగా ఏర్పాటైన జిల్లా కాంగ్రెస్ నేతల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ పేదలకు చేసింది ఏమి లేదన్నారు. అలాంటి పార్టీ రాష్ట్రంలో ఎలా అధికారంలోకి వస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గుండెకాయ గ్రామాల్లో ఉందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గ్రామాల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండంటూ కేడర్కు ఈ సందర్భంగా ఆయన సూచించారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా పని చేసే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేయాలని కేడర్కు స్పష్టం చేశారు. పార్టీలో అందరికీ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి.. లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తన పాదయాత్రలో అన్ని విషయాలను తెలుసుకున్నారని వివరించారు. అందుకే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని పీసీసీ చీఫ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి రేషన్ కార్డు మంజూరు చేశామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ళు, సన్న బియ్యం, ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుందన్నారు. పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఎన్ని నిధులు ఇచ్చింది.. ఎన్ని నియామకాలు చేసింది అంటూ పీసీసీ చీఫ్ సూటిగా ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి పోతే అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తోందని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు రాజేశ్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సావర్కర్, కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.