– సైట్ విజిట్ నిబంధన గతంలో ఉన్నదే
– ఎవరి ప్రయోజనం కోసం..ఎవరు చేస్తున్నారు
– ఒకరు కథనం..మరొకరు లేఖ.. ఇంకొకరు విచారణ
– వీరికి ఉన్న సబంధం ఏమిటో ప్రజలకు తెలియాలి
– సింగరేణిపై కిషన్ రెడ్డి విచారణను స్వాగతిస్తున్నాం
– అన్ని వ్యవహారాలపై విచారణ జరగాలన్నదే తన అభిప్రాయం
– మీడియా సమావేశంలో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి24: సింగరేణి పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. సింగరేణి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కొందరు రాతలు రాస్తున్నారని, ఈ నినాదాల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయి. అంటూ ప్రశ్నలు సంధించారు. అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థపై నిందలు మోపుతూ కార్మికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని డిప్యూటీ సీఎం ఆగ్రహించారు. ప్రజాభవన్లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ సింగరేణిపై కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వంపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ’ఒకరు కథనం రాశారు, మరొకరు లేఖ రాశారు.. ఇంకొకరు విచారణకు ఆదేశించారు.. ఈ ముగ్గురికీ ఉన్న సంబంధం ఏంటి అని భట్టి ప్రశ్నించారు. సింగరేణి అటానమస్ సంస్థ అని, అన్ని నిర్ణయాలు వారే తీసుకుంటారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రావడం, విచారణ జరిపించడాన్న స్వాగతిస్తున్నామని చెప్పారు. సింగరేణిలో తాను వచ్చాకే సైట్ విజిట్ నిబంధన వచ్చిందని ప్రచారం చేస్తున్నారని, నిజాలు బయటకు రావాలని, ప్రజలకు తెలియాలని చెప్పుకొచ్చారు. 2018లోనే సైట్ విజిట్ నిబంధనను కోల్ ఇండియా తీసుకొచ్చిందని, 2021లో ఎన్ఎమ్డీసీ కూడా అమలు చేసిందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. 2023లో సింగరేణిలోనూ సైట్ విజిట్ కండీషన్ అమల్లోకి వచ్చిందని, సీఎమ్పీడీఐ డాక్యుమెంట్లో సైట్ విజిట్ తప్పనిసరని ఉందని చెప్పారు. 2018, 2021లో డిప్యూటీ సీఎం భట్టి లేడని, కాంగ్రెస్ లేదని ఆయన గుర్తు చేశారు. దేశంలోని పలు కేంద్ర, రాష్ట్ర సంస్థలు సైట్ విజిట్ అమలు చేస్తున్నాయన్నారు. రైల్వే, హిందుస్థాన్ కాపర్స్, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ, మహారాష్ట్ర ప్రభుత్వ టెండర్లలోనూ ఈ నిబంధన ఉందని భట్టి పేర్కొన్నారు. సైట్ విజిట్ ఎక్కడా లేదన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దురుద్దేశంతో రాసిన ఓ కథనం ఆధారంగా ఒక నేత లేఖ రాశారని, అపోహలు పెరుగుతాయని వెంటనే టెండర్లు రద్దు చేశామని భట్టి తెలిపారు. నైనీ కోల్ బ్లాక్లకు బీఆర్ఎస్ హయాంలోనే టెండర్లు పిలిచారని, దేశంలో ఏ మైనింగ్ యాక్టివిటీలోనూ డీజిల్ సప్లయ్ చేసే పరిస్థితి లేదని చెప్పారు. 2022లో నైనీ బ్లాక్ టెండర్లలో డీజిల్ విధానం మార్చారని వెల్లడించారు. సింగరేణి 25 టెండర్లలో 20 బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 5 టెండర్లే జరిగాయని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటివరకు కాంగ్రెస్కు సంబంధించిన ఎవరికీ టెండర్లు రాలేదని అన్నారు.
సృజన్రెడ్డితో సీఎంకు సంబంధాలు నిజం కాదు
సృజన్రెడ్డితో సీఎంకు సంబంధాలున్నాయన్న వార్తల్లో నిజం లేదన్నారు. సృజన్రెడ్డి కంపెనీ శోధ కన్స్టక్ష్ర ప్రైవేట్ లిమిటెడ్ అని, ఎండీ దీప్తి రెడ్డి కందాల కూతురు అని, సృజన్రెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అల్లుడని భట్టి వివరించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావుకు అసలు ఏం కావాలని, కేంద్రానికి ఎందుకు లేఖలు రాస్తున్నారని ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని టెండర్లపై విచారణ జరపాలని తనకు లేఖ రాయాలన్నారు. తాడిచర్ల నుంచి నైనీ వరకు అన్నింటిపై దర్యాప్తు చేద్దామని అన్నారు. సీఎం రేవంత్ రాగానే చర్చించి విచారణకు ఆదేశిస్తామని చెప్పారు. తాను ఆస్తులు కూడబెట్టుకోవడానికి రాజకీయాల్లో రాలేదని, బొగ్గు బావుల్లో ఏ రాబందులను వాలనివ్వనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణకు ఆత్మగా ఉన్న సింగరేణిపై కొన్ని కట్టుకథలు వస్తున్నాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. సింగరేణి ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో మొత్తం 25 కాంట్రాక్టులు జరిగితే.. 20 టెండర్లు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని మంత్రి వివరించారు. తెలంగాణకు ఆత్మ సింగరేణి అని అన్నారు. అలాంటి సింగరేణిపై కట్టుకథలు.. కొన్ని లేఖలు.. కొన్ని రివ్యూ లు వచ్చాయని మండిపడ్డారు. 42 వేల మంది సింగరేణి ఉద్యోగుల.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 20 వేల మంది నీ మానసికంగా దెబ్బతీసేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా పెట్టుబడులు రాకుండా కట్టుకథల విషపు రాతలు.. తొలిపలుకు రాతలు.. తప్పుడు ప్రచారం.. రాష్ట్ర ప్రభుత్వం పై కావాలని కథనాలు రాస్తున్నారు. రోజుకో కథ వండి వారిస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా సింగరేణికి సంబంధించిన ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా వీటన్నింటిని చూస్తూ ఉంటే ఏ రాబందులు ఏ గద్దలు ఏ దోపిడిదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్లుగా కనిపిస్తుందన్నారు. ఇటువంటి రాతలతో తెలంగాణకు సంబంధించినటువంటి అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి సింగరేణికి నష్టం చేస్తున్నారన్న సంగతి మర్చిపోవద్దని గుర్తు చేశారు. సింగరేణి నిర్ణయం మంత్రుల దగ్గరికి రాదు.. అటానమస్ సంస్థ ఇది. మంత్రి మండలి దగ్గరకు కూడా రాదు.. ఇంగితం ఉన్న.. విజ్ఞానం ఉన్న వారు ఇలా రాయరు అని తెలిపారు. పారదర్శకంగా ఉండాలి అనుకోవడమే కాదు.. పారదర్శకంగా ఉండాలి అని వెంటనే టెండర్ రద్దు చేయాలి అని చెప్పానన్నారు. హరీష్ లేఖ రాయడం.. కిషన్ రెడ్డి విచారణ చేపట్టడం.. మంచిది అయ్యిందన్నారు. కిషన్ రెడ్డి చర్యలను స్వాగతిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం.. అడ్డగోలుగా ప్రచారం చేసే వాళ్ల బతుకు బయటపడాలని అనుకున్నానని అన్నారు. గత డాక్యుమెంట్ల ఆధారంగానే సింగరేణి టెండర్లు పిలిచింది.. నిజం ఇలా ఉంటే.. భట్టి విక్రమార్క చేసినట్టుగా కథనాన్ని వండి వార్చారని మండిపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





