- భారత్ను ప్రపంచంతో పోటీపడేలా చేశారు
- పివి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన డిప్యూటీ సీఎం
హైదరాబాద్, ప్రజాతంత్ర డిసెంబర్ 23 : దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలంగాణలో పుట్టడం మనందరి అదృష్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆయన 20 వర్ధంతి సందర్భంగా పివి ఘాట్లో నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పివి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యమంత్రిగా పీవీ తెచ్చిన భూసంస్కరణలు భారతదేశ చరిత్రలోనే గొప్ప మలుపునకు పునాది వేశాయన్నారు.
దేశంలో మొట్టమొదటి మానవ వనరుల శాఖ మంత్రిగా ప్రణాళికబద్ధంగా తెచ్చిన ఆశ్రమ పాఠశాలలు మార్గదర్శకంగా నిలిచాయని తెలిపారు. చిన్నాభిన్నమైన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధానిగా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలతో భారతదేశం ప్రపంచంతో పోటీపడేలా బాటలు వేశారని తెలిపారు. పివి పరిపాలనాదక్షుడే కాదు.. గొప్ప సాహితీవేత్త, సంఘసంస్కర్త అని కొనియాడారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అనేక నిర్ణయాలు, విధానాలు ఆయన హయాంలో జరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడిగా గొప్ప సేవలదించారని గుర్తుచేశారు. ఆయన బాటలో నడవడంతోనే మనం పివికి అర్పించే ఘన నివాళి అని అన్నారు.





