~ మోటర్కు స్విచ్ ఆన్ చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
ఖమ్మం,ప్రజాతంత్ర, జులై 12: గోదావరి జలాలను ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టుకు తరలించేందుకు శనివారం సీతారామ ప్రాజెక్టులో భాగంగా అశ్వాపురం మండలం కొత్తూరు వద్ద ఏర్పాటు చేసిన ఎత్తిపోతల నుంచి ఒక మోటారు ఆన్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటపడి సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలను తరలించే పనులను పూర్తిచేశారు. ప్రస్తుతం గోదావరికి వరద ఉద్ధృతంగా వస్తోంది. మరో వైపు పాలేరు వద్ద అండర్ టన్నెల్ గత ఏడాది కూలిపోయింది.. దీంతో సాగర్ జలాలు ఖమ్మం జిల్లాలోని పంటపొలాలకు విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది. మరో పదిరోజులు వరకు నీరు రాని పరిస్థితి. దీనివల్ల తల్లాడ, కల్లూరు మేజర్ల కింద పొలాలు ఎండిపోతున్నాయి.. దీనిని దృష్టిలో పెట్టుకొని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు కింద కొత్తూరు వద్ద ఏర్పాటు చేసిన మోటార్లలో ఒక దానిని శనివారం ఆన్ చేశారు. దీనివల్ల గోదావరి జలాలు ఏన్కూరు వద్ద సాగర్ కాలువలో ప్రవేశించి తల్లాడ, కల్లూరు మేజర్ల కింద ఉన్న సుమారు 30వేల ఎకరాల్లో ఉన్న వరిపంటను రక్షించేందుకు అవకాశం ఉంది. సీతారామ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాకపోయినప్పటికీ అవకాశం ఉన్న మేరకు మోటార్లు బిగించి ఖమ్మం జిల్లా రైతును ఆదుకోవడంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి అభినందనీయమని రైతులు తెలిపారు.




