– మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: వర్షపు నీటి సంరక్షణలో తెలంగాణ తొలి స్థానం పొందడంలో కీలక పాత్ర పోషించిన గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క సచివాలయంలో శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. వర్షపు నీటి సంరక్షణలో దేశంలోకెల్లా తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా ఎంపిక కావడం వెనక ప్రభుత్వ సంకల్పంతోపాటు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల సమన్వయం, క్షేత్రస్థాయి సిబ్బంది తోడ్పాటు ఎంతగానో ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. జల సంరక్షణతోనే జన సంరక్షణ సాధ్యమవుతుందని, జల సంరక్షణలో భాగమైన గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందిని అభినందిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం గురువారం ప్రకటించిన జల సంచాయ్ జన భాగీదారీ 1.0 విభాగంలో తెలంగాణకు అగ్రస్థానం దక్కిన విషయం విదితమే. తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 5,20,362 వర్షపు నీటి సంరక్షణ పనులు పూర్తయ్యాయి. చెక్డ్యాంలు, ఇంకుడు గుంతలు, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ వంటి పనుల్లో తెలంగాణ దేశంలో తొలి స్థానంలో నిలిచింది. ప్రజల భాగస్వామ్యంతో జల సంరక్షణ విజయవంతం అయింది. ఐదు లక్షలపైగా వర్షపు నీటి సంరక్షణ పనులను పూర్తి చేయడంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలకంగా వ్యవహరించింది. ఈ విజయానికి ఆ శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





