– నేతలనుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు
– ప్రభుత్వ తీరును తప్పు పడుతున్న ఎమ్మెల్యేలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 15: జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై భారీగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల శివారు ప్రాంతాలను విలీనం చేయడంతో 300 వార్డులు ఏర్పడ్డాయి. అయితే దీనిపై అభ్యంతరాల స్వీకరణ సోమవారంతో పూర్తి అయ్యింది. ఈ క్రమంలో మంగళవారం బల్దియా ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ కౌన్సిల్లో కార్పొరేటర్ల అభిప్రాయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తీసుకోనున్నారు. తద్వారా వార్డలు పనర్విభజన ఏమైనా ఉంటే చేస్తారు. ఇప్పటి వరకు 1,328 అభ్యంతరాలు వచ్చాయి. ఆదివారం ఒక్కరోజే 227 అభ్యంతరాలు స్వీకరించారు అధికారులు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. 17వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలోనే వార్డుల విభజనపై అభ్యంతరాలు తెలపడానికి జీహెచ్ఎంసీకి నగర ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్కు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి వినతిపత్రం ఇచ్చారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో మేయర్ గద్వాల విజయలక్ష్మి సమావేశం అయ్యారు. వార్డుల పునర్విభజన శాస్త్రీయంగా చేయాలంటూ మేయర్కు వినతిపత్రం ఇచ్చారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ను కలవనున్నారు. నగర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు. వార్డుల విభజనపై అభ్యంతరాలు తెలపనున్నారు. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజనపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వార్డుల విభజనపై తమకు కన్ఫ్యూజన్ ఉందని తెలిపారు. డీ లిమిటేషన్పై అభ్యంతరం తెలపడానికి కమిషనర్ను కలిశామని వెల్లడించారు. కనీసం తమకు సమాచారం లేకుండానే, ఎమ్మెల్యేల అభిప్రాయం లేకుండానే డీ లిమిటేషన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డీ లిమిటేషన్పై కార్పొరేటర్లలో ఆవేదన ఉందని చెప్పుకొచ్చారు. తమ అభ్యంతరాలు మేయర్, కమిషనర్కి లిఖిత పూర్వకంగా ఇచ్చామని వివరించారు. జీహెచ్ఎంసీ విస్తరణ జరగడం బాగుందని.. కానీ తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని… వాటిని పరిగణనలోకి తీసుకోవాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. డివిజన్ల విభజనపై ఎలాంటి సమస్యలు ఉన్నాయనే అంశాలు గుర్తించామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. కొన్ని డివిజన్లలో ఎక్కువ వోట్లు మరికొన్ని డివిజన్లలో తక్కువ ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ప్రతి విషయాన్ని మేయర్, కమిషనర్లకు వివరించామని అన్నారు. కౌన్సిల్లో అభ్యంతరాలపై వివరంగా చర్చిస్తామని తెలిపారు. వార్డులు మార్పు చేయడానికి ఏం అవకాశం ఉందో గుర్తించాలని అన్నారు. హద్దులు తెలియకుండా అధికారులు వాటిని ఖరారు చేశారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేర్కొన్నారు.