24 గంటలు ఉచిత కరెంట్‌ ఇస్తే రాజీనామా చేస్తా : మాజీ మంత్రి కేటీఆర్‌

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేటీఆర్‌ల మధ్య మాటల యుద్ధం

శాసనసభలో రైతుభరోసాపై స్వల్ప కాలిక చర్చ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. 24 గంటల విద్యుత్‌పై ఇద్దరి మధ్య తీవ్ర చర్చ జరిగింది. సభ వాయిదా వేసి అందరం నల్గొండ పోదాం.. ఈ రోజు ఒక్క లాగ్‌ బుక్కులో అయినా.. 24 గంటల కరెంట్‌ ఇస్తున్నట్లు చూపెడితే.. బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం మొత్తం రాజీనామా చేస్తామని మంత్రి కోమటిరెడ్డికి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. గతంలో 24 గంటల విద్యుత్‌ ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి సభను తప్పుదోవ పట్టించడం సరికాదు. బీఆర్‌ఎస్‌ పాలనలో సగటున 19.2 గంటల విద్యుత్‌ ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కనే చెప్పారు. ఈ విషయాన్ని ఆయనను అడగాలని కాంగ్రెస్‌ సభ్యులకు సూచిస్తున్నాను. సభ వాయిదా వేసి నల్లగొండ జిల్లాకు వెళ్లి విద్యుత్‌ పరిస్థితులు పరిశీలిద్దాం. మంత్రి కోమటిరెడ్డి కోరినట్లు ఎలక్ట్రిసిటీ, మిషన్‌ భగీరథపై చర్చ పెట్టండి.. చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. నల్లగొండ జిల్లా అభివృద్ధిపై కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. మరో పది రోజులు సమావేశాలు పొడిగించాలని కోరుతున్నాను. గతంలో జరిగిన తప్పులు ఎత్తిచూపితే మీకు ఇబ్బందిగా ఉంది. గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు మాత్రం డబ్బా కొట్టడం సబబా..? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *