‘సమ్మిట్‌’ పనులను వేగవంతం చేయాలి

– విజన్‌ డాక్యుమెంట్‌ వార్‌ రూమ్‌ సందర్శించిన డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 2: ఈనెల 8, 9 తేదీల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్‌ సమ్మిట్‌ పనుల్లో వేగం పెంచడంతోపాటు నాణ్యత, స్పష్టత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ డాక్యుమెంట్‌ వార్‌ రూమ్‌ను ఆయన మంగళవారం సందర్శించారు. డాక్యుమెంట్‌ రూపకల్పనతోపాటు ఫ్యూచర్‌ సిటీలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతానికి ఏర్పాటు చేసిన కమిటీలు, వాటి పనితీరు, ప్రగతి తదితర అంశాలపై డిప్యూటీ సీఎం కూలంకషంగా చర్చించారు. గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతానికి ఏర్పాటు చేసిన ఇన్విటేషన్‌, హాస్పిటాలిటీ, వేదిక, లాజిస్టిక్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ప్రోగ్రాం, కల్చరల్‌ ఈవెంట్స్‌, కమ్యూనికేషన్‌, డిజిటల్‌ మీడియా కమ్యూనికేషన్‌ కమిటీల అధ్యక్షులు, టీం సభ్యులతో ప్రత్యేకంగా భేటీ అయి సమీక్షించారు. అనంతరం ప్రతి విభాగంలో పనిచేస్తున్న బృంద సభ్యుల వద్దకు వెళ్లి మాట్లాడి పనులు జరుగుతున్న తీరును, వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజులుగా వార్‌ రూమ్‌లో విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పనపై భట్టి విక్రమార్క సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా, సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వార్‌ రూమ్‌ను సందర్శించారు. రేపటి నుంచి మంత్రులు సైతం వార్‌ రూమ్‌ను సందర్శించి జరుగుతున్న పనులను పర్యవేక్షించనున్నారు. డిప్యూటీ సీఎం జరిపిన సమీక్షా సమావేశంలో సీనియర్‌ అధికారులు సబ్యసాచి ఘోష్‌, సంజయ్‌ కుమార్‌, సందీప్‌ కుమార్‌ సుల్తానియా, అజిత్‌ రెడ్డి, ప్రభుత్వ మీడియా సలహాదారు శ్రీరామ్‌ కర్రీ, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇండస్ట్రీస్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌ అధికారి జయేష్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *