-పాక్ సైనిక వ్యూహాలను తేలికగా తీసుకోరాదు
-కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
న్యూదిల్లీ, డిసెంబర్ 27: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ తరవాత మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వచ్చిందన్నారు. పాక్ను తక్కువ అంచనా వేయకుండా అప్రమత్తంగా ఉండాలని, అలాగే దానిని నమ్మడానికి లేదన్నారు. పాకిస్థాన్లో మారుతున్న సైనిక వ్యూహాలు, అభివృద్ధి చెందుతున్న హైపర్ సోనిక్ క్షిపణి వ్యవస్థలను.. భారత్ తేలిగ్గా తీసుకోకూడదని హెచ్చరించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్తో ఉన్న గత అనుభవాల నుంచి భారత్ చాలా నేర్చుకున్నందున ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పూర్తి సిద్ధంగా ఉండాలన్నారు. డ్రోన్లు, రాకెట్లు, క్షిపణుల తర్వాత హైపర్సోనిక్ సాంకేతికతపై పాక్ దృష్టిసారించిందన్నారు. ఇది భారత్ తేలికగా తీసుకునే విషయం కాదన్నారు. పాక్లో ప్రజాస్వామ్యం నామమాత్రంగానే ఉందని.. ఇప్పటికీ సైనిక ఆధిపత్యమే కొనసాగుతుందన్నారు. ఆర్థికంగా దుర్భర పరిస్థితిలో ఉన్న ఆ దేశం.. విదేశాల నుంచి అందే సాయంపైనే ఆధారపడుతుందని థరూర్ అన్నారు. ఇక, బంగ్లాదేశ్ దాని సొంత సమస్యలతో సతమతమవుతోందన్నారు. పాక్తో రక్షణ ఒప్పందానికి బంగ్లా చేస్తున్న చర్చల గురించి ప్రస్తావిస్తూ.. భారత్ మాకు శత్రువు అనే అభిప్రాయాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పొరుగు దేశాల్లో పెరుగుతున్న భారత వ్యతిరేకతపై ఆయన మాట్లాడుతూ.. బంగ్లాలో స్థిరమైన, శాంతియుత వాతావరణం మనకు చాలా కీలకమన్నారు. ఈశాన్య రాష్ట్రాలను భారత్ నుంచి విడదీస్తామంటూ వస్తోన్న హెచ్చరికలపై ఆందోళన వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





