రాజకీయాలకతీతంగా ఉపరాష్ట్రపతి?

“దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి పదవులు రాజకీయాలకు అతీతమైనవని, రాజ్యాంగ రక్షణలో కీలకమైనవని జస్టిస్ సుదర్శన్ రెడ్డి తేటతెల్లం చేశారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని, ఏ రాజకీయ పార్టీలో తన సభ్యత్వం లేదని కూడా స్పష్టంగా వివరించారు.తాను న్యాయకోవిధుడిగా ప్రజల సంక్షేమం కోసం, అణగారిన వర్గాల కోసం, ఆదివాసి, దళితుల కోసం రాజ్యాంగ పరిధిలో రాగద్వేషాలకతీతంగా తీర్పులు ఇచ్చానని ప్రకటించారు. రాజ్యాంగ రక్షణ ఇవ్వాళ మన దేశ ప్రజల ప్రధాన బాధ్యత అయినందున వారికి అండగా నిలిచిందికే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉనట్టు స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి పదవి రాజకీయంగా ముళ్ళ కిరీటం కాదని, రాజకీయాలకతీతంగా రాజ్యాంగ రక్షణ, అమలుకు వీలు కల్పించే ఉన్నత స్థాయి పదవిని తెలియచెప్పారు. మరో ముందడుగు వేసి రాజ్యాంగ రక్షణ బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో తనను నక్సలైటు/ మావోయిస్ట్ అన్నా భయపడనని, వెనుకడుగేయనని స్పష్టంచేశారు.”

రమణా చారి

భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ఈసారి రసవత్తరంగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా ప్రజల అభ్యర్థిగా సుప్రీం కోర్టు జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి బరిలో నిలవడం… ఉప రాష్ట్రపతి పదవీకాలం పూర్తికాకుండానే అర్ధాంతరంగా జగదీప్ ధన్ కర్ రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీల వంటి వారే వోటర్లుగా ఉండగా మేధావులు, రాజకీయ విశ్లేషకులు, మధ్యతరగతి వర్గాలను సైతం ఈ ఎంపిక ప్రభావితం చేసింది. కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా స్వయంగా, ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.. ఏది ఏమైనా దేశ ప్రజలలో చిరకాలంగా మిగిలి ఉన్న పలు సందేహాలకు సమాధానాలు దొరికినట్లయ్యింది.

. మావోయిస్టు రహిత భారత్ గా జూన్ 2026 నాటికి ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ప్రకటించడంతో ఆయన అభ్యర్థిత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.కేంద్ర ప్రభుత్వం, చత్తీస్ఘడ్ ప్రభుత్వాల సాకారంతో ఏర్పాటు చేసిన సల్వాజుడుంను , సుప్రీంకోర్టు తీర్పుతో రద్దు చేయకపోయి ఉంటే మావోయిస్టు రహిత భారత్ ఏనాడో ఏర్పడేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు ప్రధాన కారణం జస్టిస్ సుదర్శన్ రెడ్డే ఇచ్చిన తీర్పేనని తీవ్రంగా ఆక్షేపించారు.. ఇందులో నిజం ఎంత? వాస్తవం ఏమిటి? నిజమైన దేశభక్తి అంటే ఏమిటి? ఈ చర్చ ప్రస్తుతం పౌరసమాజంలోని అన్నివర్గాలకూ వ్యాపించింది.

. దేశంలోనే అత్యంత విలువైన ఖనిజసంపద, అటవీ సంపద, నదీనదాలు, కొండలు, గుట్టలు, లోయలతో ప్రకృతి సోయగం విలసిల్లే మద్య భారతంలోఉన్న విశాలమైన దండకారణ్యం లోని ఛత్తీస్ఘడ్ రాష్ట్రం. జలపాతాలు,పుణ్యక్షేత్రాలు కలిగిన అతి గొప్ప పర్యాటక కేంద్రంగా బాసిల్లుతున్నది. అన్నిటికంటే ప్రధానంగా ఈ దేశ మూలవాసులు, ఆదివాసులు రక్షణ పొందుతూ, విలువైన ఖనిజాలను తమ పాదాల కింద సంరక్షిస్తూ, పురాతన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టుతున్న ప్రాంతం. దీనిపై కన్నేసిన కార్పొరేట్ శక్తులు పాలకుల అండతో ఆదివాసి చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకుని పర్యావరణాన్ని విధ్వంసం చేస్తూ, అక్రమ మైనింగ్ ద్వారా ఖనిజ సంపదను కోళ్లగొడుతూ, అడవులు నరికి వేస్తూ, మదన దృశ్యం చేస్తూ అభివృద్ధి ముసుగుతో కొల్లగొట్టడం ప్రారంభించారు. దీనిని వ్యతిరేకించిన ప్రజలను ఆయా ప్రాంతాల నుండి తరిమి వేస్తూ నిర్వాసిత్వ సమస్యను సృష్టించారు. ఆదివాసులను భయాందోళనకు గురి చేయడంలో భాగంగా పోలీస్ యంత్రాంగాన్నే కాక ఆదివాసీలో ఒక వర్గాన్ని చేరదీసి ప్రైవేట్ సాయిధముఠా ఏర్పాటుచేసి నిర్బంధానికి గురిచేశారు.

అలా 1991లో జన్  జాగరణ్ అభియాన్ పేరుతో మారణకాండ మొదలుపెట్టారు. ఆ తర్వాత 2005లో ప్రతిపక్ష నాయకుడు( కాంగ్రెస్) నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సల్వాజుడుం ఏర్పాటు చేశారు. భూస్వాములు, పెత్తందారులు, లొంగిపోయిన నక్సలైట్లను దీనిలో చేర్చి 26566 మందితో దీన్ని కొనసాగించారు. గృహ దహనాలు, ఆస్తుల విధ్వంసం వంటివి చేస్తూ గ్రామాలను ఖాలీ  చేయించి వారు ఏర్పాటు చేసిన బేస్ క్యాంపులకు తరలించి, నిరాఘాటంగా మైనింగ్ చేసి ఖనిజాలను వెలికి తీస్తున్నారు . ఇందుకు ఆటంకంగా ఉన్న ఆదివాసులను బానిసలకన్నా హీనంగా చూస్తూ, వేటాడబడుతున్న వారిని కాపాడేందుకు ప్రొఫెసర్ నందిని సుందర్, చరిత్రకారులు రామచంద్ర గుహ, శర్మలు 2011లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటీషన్, సాక్షాధారాలను పరిశీలించి , సల్వాజుడుం రద్దు పై సానుకూల తీర్పును సుప్రీంకోర్టు నుంచి సాధించగలిగారు. ఆ తీర్పును ప్రకటించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేడు ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. దీనికి తోడు ఎన్నికల కమిషన్ విధివిధానాలను కూడా సవివరంగా తెలియ చెప్పడంతో ఆయనకున్న ఉన్నతస్థాయి పదవీ అర్హత, రాజకీయ పరిణితి, రాజ్యాంగ అమలుపై చిత్తశుద్ధి ఆయన గౌరవాన్ని మరింత పెంచాయనడం లో ఎలాంటి సందేహాలకు తావు లేదు.

. దేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి పదవులు రాజకీయాలకు అతీతమైనవని, రాజ్యాంగ రక్షణలో కీలకమైనవని జస్టిస్ సుదర్శన్ రెడ్డి తేటతెల్లం చేశారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని, ఏ రాజకీయ పార్టీలో తన సభ్యత్వం లేదని కూడా స్పష్టంగా వివరించారు.తాను న్యాయకోవిధుడిగా ప్రజల సంక్షేమం కోసం, అణగారిన వర్గాల కోసం, ఆదివాసి, దళితుల కోసం రాజ్యాంగ పరిధిలో రాగద్వేషాలకతీతంగా తీర్పులు ఇచ్చానని ప్రకటించారు. రాజ్యాంగ రక్షణ ఇవ్వాళ మన దేశ ప్రజల ప్రధాన బాధ్యత అయినందున వారికి అండగా నిలిచిందికే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో ఉనట్టు స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి పదవి రాజకీయంగా ముళ్ళ కిరీటం కాదని, రాజకీయాలకతీతంగా రాజ్యాంగ రక్షణ, అమలుకు వీలు కల్పించే ఉన్నత స్థాయి పదవిని తెలియచెప్పారు. మరో ముందడుగు వేసి రాజ్యాంగ రక్షణ బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో తనను నక్సలైటు/ మావోయిస్ట్ అన్నా భయపడనని, వెనుకడుగేయనని స్పష్టంచేశారు.

ఉపరాష్ట్రపతి పదవికి పోటీలో ఉన్న తననూ, ,ప్రత్యర్థిని ఒకే వేదిక మీదకు తీసుకొని వస్తే, జరిగే చర్చతో ఎన్నుకునే వారికి,అభ్యర్థిని ఎంచుకోవడం తేలికగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఆత్మ ప్రబోధానుసారం ప్రజా ప్రతినిధులు వోటు వేయగలిగితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపు బాటలో పయనిస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రత్యర్థి తో పోలిస్తే జస్టిస్ సుదర్శన్ రెడ్డి కి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకపోవడం, సూటితనం, నిక్కచ్చిగా వ్యవహరించే తీరు, రాజ్యాంగ రక్షణలో ఆయనకున్న చొరవ నిబద్ధత ఆయన ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నాయి. గెలుపు ఓటములు ఎలా ఉన్నా ఈ ఎన్నిక ఉపరాష్ట్రపతి పదవి గొప్పతనాన్ని సాధారణ ప్రజానీకం వరకు అర్థమయ్యేలా చేసాయి. రాజ్యాంగానికి లోబడి నడుచుకుంటామని, రాజ్యాంగ అమలుకు భంగం కలగనీయకుండా రక్షిస్తామని అధికార పగ్గాలు చేపట్టిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్రాల, కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధుల విజ్ఞతకు వదిలేస్తే… ఇక ఎవరు దేశభక్తులో… ఎవరు అంధ భక్తులో… రాజ్యాంగ రక్షకుల ముందు ఈ ఎన్నిక సవాలుగా నిలువనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *