– ఆత్మహత్య కాదది.. ప్రభుత్వ హత్యే
– ‘ఎక్స్ ’ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్1: ఖమ్మం జిల్లాలో రైతు వీరన్న ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యతని సిద్దిపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రైతుది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వ హత్యే అంటూ ‘ఎక్స్ ‘ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పి నేడు వారి బతుకులకు భరోసా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని విరుచుకుపడ్డారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్య అత్యంత బాధాకరం. పురుగుల మందు తాగుతూ పండించిన పంటకు ధర రాక, అప్పులు తీర్చే దారి లేక చనిపోతున్నా అని వీరన్న తీసుకున్న సెల్ఫీ వీడియో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి చేసిన మోసాలకు నిదర్శనం. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హాలు అమలు చేయని ఫలితంగా బతుకులు భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఏడాదికి రూ.15,000 రైతుభరోసా ఇస్తామని బాండ్లు రాసిచ్చి అధికారంలోకి వొచ్చాక మోసం చేయడం దుర్మార్గం. పండించిన పంటను కొనే దిక్కులేక, మద్దతు ధర రాక, దళారుల దోపిడీకి రైతులు బలవుతున్నారు.సెల్ఫీ వీడియోలో వీరన్న చెప్పిన మాటలకైనా ఈ ప్రభుత్వానికి చలనం వొస్తుందా? ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారు? ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంతమంది రైతులను బలి తీసుకుంటారు అని ప్రశ్నంచారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో కౌలు రైతు వీరన్న కుటుంబాన్ని పరామర్శించాలని, ఆ కుటుంబానికి వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని చేతులు జోడించి విన్నవిస్తున్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దాం.. మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. వొచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.. రైతులకు మళ్లీ మంచి రోజులు వొస్తాయి.. ఎవరూ అధైర్యపడకండి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





