మార్చ్ , 2026

2026 మార్చ్ నెల లో ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా మిత్ర దేశాల పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతుంది. చమురు కోసం గల్ఫ్ దేశాల పై ఆధారపడ్డ మన దేశం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా  ఇదే నెలలో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో నూతన సంవత్సర వేడుకలు , మన రాష్ట్రంలో హోలీ ,ఉగాది,రంజాన్, శ్రీ రామ నవమి పండుగలను ఉత్సాహంగా ..ఉల్లాసంగా ..భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం విశేషం.

భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఇక్కడ పండుగలు కేవలం మతపరమైన ఆచారాలు మాత్రమే కావు; అవి ఈ దేశపు సామాజిక జీవన నాడి. అయితే, రాజ్యాంగం నిర్దేశించిన ప్రజాస్వామ్య విలువల చట్రంలో, మత విశ్వాసాలకు మరియు లౌకికవాదానికి మధ్య సమతుల్యతను కాపాడుకోవడం నేడు ఒక సవాలుగా మారింది.

భారతదేశంలో పండుగలు కాలానుగుణంగా వొస్తాయి, కానీ అవి వదిలి వెళ్లే ప్రభావం శాశ్వతమైనది. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ లేదా దీపావళి ఏదైనా కావొచ్చు—అవి వ్యక్తుల మధ్య ఉన్న సామాజిక అంతరాలను తొలగించి, సామూహిక ఆనందాన్ని పంచుతాయి. పండుగల సమయంలో జరిగే క్రయవిక్రయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతాన్నిస్తాయి అంతే కాదు తరతరాలుగా వొస్తున్న ఆచారాలను కాపాడుకుంటూనే, ఆధునికతను అందిపుచ్చుకోవడంలో పండుగలు కీలక పాత్ర పోషిస్తాయి.

భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి తన ఇష్టానుసారం మతాన్ని అనుసరించే, ప్రచారం చేసే స్వేచ్ఛను కల్పించింది. ఆర్టికల్ 25 నుండి 28 వరకు ఉన్న నిబంధనలు మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా గుర్తించాయి. అయితే, ఈ స్వేచ్ఛ విశృంఖలమైనది  కాదు. ప్రజా శాంతికి, నైతికతకు మరియు ఆరోగ్యానికి లోబడి ఉండాలి. మత విశ్వాసం అనేది వ్యక్తిగతమైనది అయినప్పటికీ, అది బహిరంగ ప్రదేశాల్లో పండుగల రూపంలో వ్యక్తమైనప్పుడు, అది రాజ్యాంగబద్ధమైన పరిమితులకు లోబడి ఉండాలి. అప్పుడే  ప్రజాస్వామ్య స్ఫూర్తి పరీక్షించబడుతుంది.

పాశ్చాత్య దేశాల్లో సెక్యులరిజం అంటే మతానికి, రాజ్యానికి (State) మధ్య పూర్తి విడతీయడం. కానీ భారత్‌లో అది ‘సర్వ ధర్మ సమభావం’. అంటే ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుంది, ఏ ఒక్క మతాన్ని అధికారిక మతంగా గుర్తించదు. మెజారిటీ మతమైనా, మైనారిటీ మతమైనా చట్టం ముందు సమానమే. పండుగల నిర్వహణలో లేదా మతపరమైన ఊరేగింపుల్లో ప్రభుత్వం తటస్థంగా ఉంటూ శాంతిభద్రతలను కాపాడుతుంది .

ప్రస్తుత తరుణంలో, మతం మరియు రాజకీయాల మధ్య గీత మసకబారుతోంది. పండుగలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం, మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టి వోట్లు దండుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. మత విశ్వాసాలను అడ్డం పెట్టుకుని సమాజాన్ని విభజించడం వల్ల సామాజిక సామరస్యం దెబ్బతింటుంది. పండుగల సమయంలో శబ్ద కాలుష్యం, ట్రాఫిక్ నిబంధనలు లేదా పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై కోర్టులు ఇచ్చే తీర్పులను మతపరమైన కోణంలో చూడటం దురదృష్టకరం. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే మత విశ్వాసాలు వ్యక్తిగత ఆధ్యాత్మికతకు పరిమితం కావాలి, మరియు ప్రజా జీవితంలో అవి ఇతరుల హక్కులకు భంగం కలిగించకూడదు.  రాజ్యాంగం సూచించిన ‘సైంటిఫిక్ టెంపర్’ (శాస్త్రీయ దృక్పథం) ప్రతి పౌరుడిలో ఉండాలి. మూఢనమ్మకాలకు, మత విద్వేషాలకు తావులేకుండా పండుగలను జరుపుకోవాలి.

పండుగలు మన సంస్కృతికి అద్దం పడతాయి, మతం మన విశ్వాసానికి బలం ఇస్తుంది. కానీ, ఇవన్నీ ప్రజాస్వామ్య సౌధం పైన ఉన్న కలశాలు మాత్రమే. పునాది మాత్రం సెక్యులరిజం మరియు రాజ్యాంగబద్ధత. ఒక పౌరుడి పండుగ జరుపుకునే హక్కు, మరొక పౌరుడి స్వేచ్ఛకు ఆటంకం కానంత వరకు  దేశం సుహృత్ , సోదర భావంతో పరిఢవిల్లుతుంది. మతాతీతమైన ప్రేమాభిమానాలే భారత ప్రజాస్వామ్యానికి నిజమైన అలంకారాలు. మతం ఒక ప్రవహించే నది వంటిది, రాజకీయం దానికి నిర్మించిన గట్టు వంటిది. గట్టు పటిష్టంగా ఉంటేనే నది సమాజానికి ఉపయోగపడుతుంది. గట్టు తెగినా లేదా నది ఉప్పొంగినా వినాశనమే మిగులుతుంది. ప్రజాస్వామ్యంలో పౌరులు మతపరమైన భావోద్వేగాలకు లోనుకాకుండా, రాజ్యాంగబద్ధమైన హక్కుల గురించి ఆలోచించినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *