– అందుబాటులో 47.68 లక్షల సంచుల యూరియా నిల్వలు
– కలెక్టర్ల పర్యవేక్షణలో జరుగుతున్న సరఫరా
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: వీడియో కాన్ఫరెన్స్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో యూరియా సరఫరా జరుగుతోంది. మంత్రి సూచన మేరకు జేడీఏ, ఏడీఏలను జిల్లా ప్రత్యేక అధికారులుగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ నియమించడంతో వారు తమకి కేటాయించిన జిల్లాలలో పర్యటించి యూరియా సరఫరాలను పర్యవేక్షించనున్నారు. రబీ-2025-26 సీజన్ (అక్టోబర్-మార్చి)కు గాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వివిధ రకాల ఎరువులుగా మొత్తం 20.10 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా అందులో 10.40 లక్షల మెట్రిక్ టన్నులు మంజూరైనట్లు మంత్రి తుమ్మల తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అక్టోబర్ నుండి ఇప్పటివరకు రాష్ట్రానికి 5.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా ఇప్పటికే 5.84 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా అయినట్లు పేర్కొన్నారు. కేటాయించిన పరిమాణం కంటే 24 వేల మెట్రిక్ టన్నులు అధికంగా సరఫరా జరిగిందని తెలిపారు. రబీ సీజన్లో ఇప్పటివరకు రైతులు 3.71 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేశారని, ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కలిపి 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అంటే 47.68 లక్షల సంచులు అందుబాటులో ఉన్నాయని మంత్రి వెల్లడిరచారు. రబీ సీజన్కు అవసరమైనంత యూరియా రాష్ట్రంలో పూర్తిగా అందుబాటులో ఉంది. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రతిపక్ష నాయకుల మాటలు విని భయాందోళనకు గురవకుండా అవసరమైన మేరకే కొనుగోలు చేయాలని మంత్రి కోరారు. యూరియా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోందని పేర్కొన్నారు. జిల్లాల వారీగా యూరియా నిల్వల వివరాలను వ్యవసాయ శాఖ విడుదల చేసిందని, అన్ని జిల్లాల్లో తగినంత నిల్వలు ఉన్నాయని, ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ఎరువుల సరఫరా వ్యవస్థను ప్రభుత్వం క్రమబద్ధంగా నిర్వహిస్తోందని, రబీ సీజన్ మొత్తం యూరియా కొరత తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు, రైతులకు అవసరం ఉన్నంత మేరకు సరఫరా చేస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





