– యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణ పనులు మొదలయ్యాయి
– గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: టీజీటిబ్ల్యుఆర్ఈఐ సొసైటీకి చెందిన కాంట్రాక్టు, ఔట్సోర్స్, పార్ట్టైమ్ సిబ్బందికి, సబ్జెక్ట్ అసోసియేట్స్, ప్రధాన కార్యాలయంలోని సిబ్బందికి, స్వీపింగ్, శానిటేషన్, కేటరింగ్ సేవలకు సంబంధించి రెమ్యునరేషన్, సర్వీస్ చార్జీలు విడుదల చేశామని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జులై, ఆగస్టు నెలలకుగాను కాంట్రాక్టు/ఔట్సోర్స్/పార్ట్టైమ్ సిబ్బందికి రూ.11.53 కోట్లు విడుదల చేశామని, ఏప్రిల్-ఆగస్టు కాలానికి సబ్జెక్ట్ అసోసియేట్స్, సీనియర్ ఫ్యాకల్టీ, గేమ్స్ కోచ్లు మొదలైన వారికి రూ.2.38 కోట్లు విడుదల చేశామని తెలిపారు. జూలై, ఆగస్టు నెలలకు ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి రూ.0.22 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. జూలై-2025 వరకు స్వీపింగ్, శానిటేషన్, కేటరింగ్ సేవలకు రూ.1.04 కోట్లు సర్వీస్ చార్జీలుగా విడుదల చేశామన్నారు. జూలై, ఆగస్టుకు సంబంధించిన రూ.9 కోట్ల విడుదల చేశామని వివరించారు. 18 నియోజకవర్గాలల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించలేదని, తమ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభించటమే కాకుండా గ్రీన్ ఛాలెంజ్ ద్వారా నిధులు కేటాయించినట్లు తెలిపారు. స్కూల్స్, విద్యార్థుల విషయంలో ప్రతిపక్షాలు రాజకీయం చేయకూడదని, సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో ఎప్పుడూ భోజనం చేయలేదని, తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేశారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ శాఖలకు నిధులు కేటాయించాలని, స్కాలర్షిప్ల్లో కేంద్రం వాటా పెంచాలి అని కేంద్రాన్ని కోరామని మంత్రి తెలిపారు. చదువుకుంటూ ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం అశోక్నగర్ ప్రాంతంలో నూతన ఎస్సీ హాస్టల్ ప్రారంభించాలనే ఆలోచన చేస్తున్నామని, హైదరాబాదు నగరంలో పీిఎస్ఆర్ ఫండ్తో సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని వెల్లడిరచారు. గ్రూప్-1 పరీక్షల మెరిట్ లిస్టు విషయంలో బట్ట కాల్చి మీద వేయడం కాదు.. ఆధారాలు ఉంటే నిరూపించాలని బీఆర్ఎస్కు సవాల్ చేశారు. పిల్లల భవిష్యత్తు విషయంలో తప్పు చేయమని, అనవసరంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుండడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని లక్ష్మణ్ అన్నారు. షేక్పేట, ధర్మపురిల్లో రూ.24 లక్షలతో మోడ్రన్ కిచెన్లను పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





