– కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ సూచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల్లో వినియోగదారులకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ప్రజలు తినే బియ్యాన్ని ఇస్తేనే సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని చెప్పారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయనతో సీఎం రేవంత్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిపారు. తెలంగాణలో మాదిరి కేంద్ర ప్రభుత్వంకూడా దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అవసరమైతే దీనిపై అధ్యయనం చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. పూర్తిస్థాయి అధ్యయనం తరువాత పరిశీలించి దేశవ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ అంశంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఈ మీటింగ్కు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్టీఫెన్ రవీంద్ర, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





