రాష్ట్ర అప్పులపై రాజ్యసభలో నిర్మల ప్రస్తావన
తెలంగాణకు కేంద్రం చేసిన అభివృద్ధి వివరించిన మంత్రి
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13 : ఎపి విభజన సమయంలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అప్పుల కుప్పగా మారిందని రాజ్యసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించారు. ఏపీ విభజన సమయంలో తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉందన్నారు. కానీ ఇప్పుడు అది అప్పుల కుప్పగా తయారైందని తెలిపారు. ‘నేను ఏ పార్టీని తప్పు పట్టడం లేదు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలుత రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వమేనని అన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది నరేంద్ర మోదీ ప్రభుత్వమే.. ఎరువుల ఉత్పత్తిలో రికార్డు స్థాయిలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచామని అన్నారు.
నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోదీదే. అత్యద్భుతమైన పసుపు పండే ప్రాంతం నిజామాబాద్. తెలంగాణకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్లో పారిశ్రామిక కారిడార్ ను ఏర్పాటు చేసినందుకు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని ఆమె వెల్లడించారు. వరంగల్లో పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేశామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గుర్తు చేశారు. ‘సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశాం. బీబీనగర్ లో ఎయిమ్స్ ఏర్పాటు చేశాం. 2605 కిలోమీటర్ల జాతీయ రహదారులను వేశాం.
భారత్ మాల కింద నాలుగు గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేశాం. 5337 కోట్ల రూపాయల బడ్జెట్ ను రైల్వేల అభివృద్ధి కోసం తెలంగాణకు కేటాయించాం. ఏరుపాలెం నంబూరు మధ్య, మల్కాన్ గిరి పాండురంగాపురం మధ్య 753 కిలోటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ నిర్మించాం. ఐదు కొత్త వందేభారత్ ట్రైన్లను తెలంగాణకు ఇచ్చాం. 40 రైల్వే స్టేషన్స్ రీడెవలప్ చేసాం. పీఎం ఆవాస్ అర్బన్ కింద రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. 31 లక్షల టాయిలెట్లను స్వచ్ఛ భారత్ మిషన్ కింద నిర్మించాం. జల్జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్ల కనెక్షన్ ఇచ్చాం. 82 లక్షల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులను ఇచ్చాం. 199 జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశాం.‘ అని నిర్మాల సీతారామన్ తెలిపారు.


