ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే

– కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలిచ్చిన స్పష్టమైన తీర్పు
– బిజెపి మత రాజకీయాలకు ప్రజలు చెక్ పెట్టారు
– సంక్షేమ పథకాలకు పట్టం కట్టారు
– బిఆర్ఎస్ పాలనలో స్థానిక సంస్థలు నిర్లక్ష్యానికి గురయ్యాయి
– జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎగిరేది కాంగ్రెస్ పతాకమే
– నిజామాబాద్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

నిజామాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 16:  పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమే నని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 పురపాలక సంఘాల పరిధిలోనీ వార్డులతో పాటు కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లు మొత్తం 2,996 ఉండగా 1,537 వార్డులు,డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మ్రోగించడమే ఇందుకు అద్దం పడుతుందన్నారు.  నిజామాబాద్ కార్పొరేషన్లో 2 నుండి 17 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పెరగడం అంటేనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందనడానికి సంకేతమన్నారు.  మతతత్వ రాజకీయాలతో ప్రజలను విభజన చేసేందుకు బి.జె.పి చేస్తున్న రాజకీయాలకు చెక్ పెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగ యం.ఐ.యం తో కలిసి నిజామాబాద్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ పార్టీ చే జిక్కించుకుందన్నారు.  బిజెపి నెరుపుతున్న మతతత్వ రాజకీయాలపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ప్రస్తుతం జరిగిన పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు నిదర్శనంగా మారాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవాచేశారు.  అయితే నిజామాబాద్,కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో మరిన్ని స్థానాలు గెలవాల్సిన ఆవశ్యకతను ఆయ‌న వివరించారు.  కాంగ్రెస్ పార్టీ లీడర్, క్యాడర్ సమన్వయంతోటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం మాత్రమే కాకుండా పట్టణ ప్రాంతాలలోను అజేయమైన శక్తిగా ఆవిర్భావించిందని ఆయన ప్రశంసించారు. అద్భుతమైన ఫలితాలు రావడానికి శ్రమించిన పార్టీ శ్రేణులకు,ఆదరించి అక్కున చేర్చుకున్న ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకున్న మీదట నిజమాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు.  పి.సి.సి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్,ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి,నిజామాబాద్ నూతన మేయర్ ఉమారాణి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజలు లౌకికవాదం వైపు మొగ్గు చూపుతున్నారు అనడానికి ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయ‌న్నారు.
జరుగుతున్న అభివృద్ధి అమలౌతున్న సంక్షేమ పథకాలకు ప్రజమోదం లభించిందని సంతృప్తిని వ్యక్తం చేశారు. పురపాలక సంఘాల ఎన్నికల్లో సన్నబియ్యం పంపిణీ గేమ్ చెంజర్ గా నిలిస్తే ఉచిత బస్ ప్రయాణం,200 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా సరఫరా చేయడం వంటి పధకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ను ఆమోదించి ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పాలనలో పురపాలక సంఘాలు నిర్లక్ష్యానికి గురి అయ్యాయని,పదేళ్లలో అనుకున్న మేర పురోగతి కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఇన్‌చార్జ్ గా వ్యహరించిన నిజామాబాద్ లోకసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఫలితాలు రాబట్టుకుందని ఆయన తెలిపారు. నిజమాబాద్ కార్పొరేషన్ తో పాటు ఆర్ముర్,భోదన్, కోరుట్ల,మెట్పల్లి,జగిత్యాల, రాయకల్ పురపాలక సంఘాల పరిధిలో సి.సి.రోడ్లు,డ్రైనేజ్,పారిశుధ్యం,విద్య,ఆరోగ్యం, విద్యుత్ రంగాలలో అభివృద్ధి సాధించి జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలపాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో కూడా కాంగ్రెస్ పార్టీదే ఘానవిజయమన్న‌ ఆశాభావం వ్యక్తం చేశారు. జూబ్లిహిల్స్ ఎన్నికల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంద‌న్నారు.

ఇక శరవేగంగా నిజామాబాద్‌ అభివృద్ధి

నిజామాబాద్‌ ‌నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి తెలిపారు. అందుకోసం నిధులు ప్రత్యేక కేటాయించనున్నట్లు చెప్పారు. నిజామాబాద్‌లో ఎంఐఎంతో కలిసి కాంగ్రెస్‌ ‌మేయర్‌ ‌పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. మేయర్‌గా ఉమారాణి, డిప్యూటీ మేయర్‌గా సల్మా తహసీన్‌ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌తో కలిసి ఉత్తమ్ ‌మీడియాతో మాట్లాడారు. రహదారులు, అభివృద్ధి విషయంలో ఉమ్మడి నిజామాబాద్‌ ‌జిల్లాకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వబోతోందని చెప్పారు. తెలంగాణలో నిజామాబాద్‌ ఓ ‌గొప్ప నగరంగా అభివృద్ధి చెందాలని, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అందుకు కృషి చేస్తుందని మహేశ్‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు. నిజామాబాద్‌ ‌నగర మేయర్‌ ‌పీఠం కాంగ్రెస్‌ ‌పార్టీ చేజిక్కించుకోవడం అభివృద్దికి సంకేతమని అన్నారు.  మూడు ఓట్ల తేడాతో మేయర్‌, ‌డిప్యూటీ మేయర్‌ ‌పదవులను కాంగ్రెస్‌ ‌పార్టీ గెల్చుకుందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో నిజామాబాద్‌ ‌నగరపాలక సంస్థలో బీజేపీ 28 సీట్లు కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ ‌17, ఎంఐఎం 14, బీఆర్‌ఎస్‌  1 గెలుచుకున్నాయి. మేయర్‌ ‌పీఠం దక్కాలంటే మ్యాజిక్‌ ‌ఫిగర్‌ 31 ‌రావాల్సి ఉంటుంది. మ్యాజిక్‌ ‌ఫిగర్‌కు మూడడుగుల దూరంలో బీజేపీ నిలిచిపోయింది. అలాంటి వేళ అధికార కాంగ్రెస్‌ ‌అగ్రనేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఎంఐఎంను తమ దారికి తెచ్చుకున్నారు. బీఆర్‌ఎస్‌ ‌నుంచి గెలిచిన ఒక అభ్యర్థి కాంగ్రెస్‌ ‌కండువా కప్పుకున్నారు. దాంతో మేయర్‌ ‌పీఠం కాంగ్రెస్‌ ‌ఖాతాలో పడింది. దాంతో నగర మేయర్‌గా ఉమారాణి పేరును ఖరారు చేశారు. అయితే బీజేపీని ఓడించేందుకు బీఅర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ఎంఐఎం ‌పార్టీలు ఒకటయ్యాయని ఎంపి ధర్మపురి అర్వింద్‌ ‌మండిపడ్డారు. కాళేశ్వరం, ఈ-కార్‌ ‌రేసింగ్‌ ‌తదితర కేసుల్లో బీఆర్‌ఎస్‌ ‌అధినేతలు కేసీఆర్‌, ‌కేటీఆర్‌లను సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఎందుకు కాపాడుతున్నారో ఈ రోజు అర్థమైందమన్నారు. ఇందూరులో బీజేపీని ఓడించడానికి అనైతిక పొత్తుకు శ్రీకారం చుట్టారంటూ వారిపై అర్వింద్‌ ‌నిప్పులు చెరిగారు. బీజేపీ ఓటమిలో కాంగ్రెస్‌ ‌రంగు పూసుకుని తిరిగే పోలీసుల హస్తం కూడా ఉందని ఆరోపించారు. ఈ ఐదేళ్ల పదవి పూర్తయ్యే లోపు ఈ ఫలితాన్ని రివర్స్ ‌చేసి చూపిస్తామని ఆయన శపథం చేశారు. అయితే ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో నైతిక విజయం తమదేనని ప్రకటించారు. ఈ టర్మ్ అయ్యేలోపు కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఎంపీ అర్వింద్‌ ‌స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *