పర్యవేక్షణ పదం పలుచబడ్డది

“ఉపాధ్యాయులే బడుల తనిఖీ అధికారులు” అంటూ విద్యాశాఖ తాజాగా ఉత్తర్వుల జారీ చేయటం విద్యాశాఖ పై ప్రభుత్వ అవగాహనా రాహిత్యంగా  లేదా నిర్వహణా వైఫల్యంగా భావించాలి. “చదువు చారెడు – బలపాలు దోసెడు”అన్న చందాన విద్యా సంవత్సరంలో వాస్తవ తరగతి బోధన తక్కువై పరిశీలనలు,పర్యవేక్షణలు ఎక్కువ అవుతున్నాయి. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులకు మార్గదర్శిగా, తక్షణ పర్యవేక్షకులుగా ప్రధానోపాధ్యాయులు,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ,మండల విద్యాధికారులు ఉండగా అదనంగా ఈ ఉపాధ్యాయ పర్యవేక్షణ బృందాల ఏర్పాటు అనవసరంగానే భావించాలి.

పైగా ఉపాధ్యాయుల పనితీరు పై ఉపాధ్యాయులనే పరిశీలకులుగా ఏర్పాటు చేయాలనుకోవటం మరిత పనికిమాలిన చర్య. “ఉట్టికెగరలేనమ్మ మింటికెగసిందని” పాఠశాల విద్య నిర్వహణ లో అవగాహనరాహిత్య, అశాస్త్రీయ విధాన నిర్ణయాలకు తోడు సాంకేతిక పరిజ్ఞానం పేరిట కంప్యూటర్ డిజిటల్,ఏ.ఐ.తదితర జి.పి.ఎస్.ద్వారా ఫోటోల అప్ లోడ్, ఎఫ్.ఆర్.ఎస్.ద్వారా పిల్లల హాజరు,ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా ఉపాధ్యాయుల హాజరు వీటన్నింటినీ సాంకేతిక హింస గా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా, చేజర్ల మండలంలో ఒక ఉపాధ్యాయుడు తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సంఘటన గమనార్హం.

ప్రాథమిక పాఠశాలలపై తనిఖీకి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం లేదా ఎస్‌.జీ.టీ.లు ,ప్రాథమికోన్నత పాఠశాలలను స్కూల్‌ అసిస్టెంట్‌లు,ఉన్నత పాఠశాలలకు స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్లు రోజుకు ఒకటి చొప్పున మూడు నెలల్లో 50 హైస్కూళ్లను తనిఖీ చేయాలి. ఇందుకు పదేళ్ళ బోధనానుభవం కలిగిన సీనియర్ ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడే కమిటీ ఎంపిక చేస్తుంది. ఎంపికైన పరిశీలకులు పాఠశాల స్థాయిలో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, ప్రధాన కార్యక్రమాల అమలు తీరు తదితర వాటిని పరిశీలించి ఆయా డి.ఈ.ఓ.లకు ప్రతి నెలా 5వ తేదీలోపు నివేదికలు అందజేస్తారు. వాటిపై ప్రతినెల కలెక్టర్‌ ఆధ్వర్యంలో సమీక్షిస్తారు. పాఠశాలల క్షేత్ర స్థాయి సమస్యలు పరిష్కరించకుండా మౌలిక సౌక‌ర్యాలు ఏర్పాటు చేయకుండా, బోధన బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీ పై దృష్టి సారించకుండా ప్రభుత్వం ప్రభుత్వ విద్యను క్రమంగా కునారిల్ల చేస్తూన్నది.ఈ విద్యా సంవత్సరం విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి మరింత దిగజారింది.
ఉపాధ్యాయుడిని తరగతి బోధనాభ్యసనలో ఒక యంత్రపు పనిముట్టుగా మార్చి తరగతి గదిని ఇప్పటికే అర్ధరహితం చేశారు. ఆ యంత్రపు పనిముట్టు పనితీరు ఎలా వుందో పరిశీలించి, డి.ఈ.ఓ.లకు నివేదించటం,ఆ నివేదికలను జిల్లా కలెక్టర్ సమీక్షించటం ఇంత హైడ్రామా అవసరమా! రెండు రకాల ఎమ్మార్పీ ప్రయోగం విఫలమైన తరువాతనే కాంటాక్ట్ పద్దతిన క్లస్టర్ రిసోర్స్ పర్సన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.గతంలో నిర్వహించిన ఆ ఎమ్మార్పీ వ్యవస్థ ఉపాధ్యాయుల పై, బళ్ళపై చేసిన అర్ధరహిత పెత్తనం తిరిగి పునరావృతం కాకుండా ఉండడం అవసరం. ఈ నిత్య పర్యవేక్షణలు తరగతి గది బోధనకు అవసరమైన మార్గదర్శనం చేసే విధంగా,బోధనను మరింత మెరుగు పరిచే విధంగా ఉండాలి. ఉపాధ్యాయుల పనితీరుపై అదే కేడర్ కు చెందిన మరో ఉపాధ్యాయుడి పర్యవేక్షణ ఉపాధ్యాయుల మధ్య అసంతృప్తి పెరిగేందుకు , కొన్ని సందర్భాలలో అశాంతికి దారి తీసే అవకాశాలు ఉంటాయి…  
ప్రాథమిక పాఠశాలల్లో తరగతికొక ఉపాధ్యాయుడు లేరు.హైస్కూళ్ళలో సబ్జెక్టు నిపుణుల కొరతను వర్క్ అడ్జస్ట్ మెంట్ తో సరిచేసిన ఫలితంగా ఉపాధ్యాయుల పనిభారం పెరిగింది.ఆధునిక సాంకేతికను పాఠశాల అభివృద్దికి జోడించే పేరిట ఆప్ ల ద్వారా రోజువారీ సమాచారం,పోటోలు పంపించటం,వివిధ రకాల బోధనేతర కార్యక్రమాల నిర్వహణ ఉపాధ్యాయులను గందరగళంలో పడేస్తుంది.ఈ నేపధ్యంలో 729 మండలాలల్లోని 24,246 పాఠశాలల్లో రెండు వేల మంది ఉపాధ్యాయులను పర్యవేక్షణ పేరిట బోధనకు దూరం చేసి,బడి బయట పంపటం సమంజసనీయం కాదు. పాఠశాల పర్యవేక్షణకు పదేళ్ళ బోధనానుభవం అర్హత అనేది పూర్తిగా అర్ధరహితం. 729 మండలాధికారులు ,1817 మంది క్లస్టర్ హెడ్ మాస్టర్లు,హై స్కూల్స్ లలో గెజిటెడ్ హెడ్ మాస్టర్ల పర్యవేక్షణను ప్రభుత్వం విశ్వసించటం లేదా!? ఉపాధ్యాయులు బోధనలో తమ సొంత ఆలోచనలను అమలు చేసే స్వేచ్ఛ,అవకాశాలను ఎప్పుడో కోల్పోయాడు.ఏ తరగతిలో ,ఏ రోజు‌‌,ఏ పీరియడ్, ఏ పాఠం ఎలా చెప్పాలి! అనేది క్షేత్రస్థాయిలో అనుభవం లేని అధికారులు,వారు రూపొందించే మాడ్యుళ్ళు,వాటి మేరకు ఇచ్చే శిక్షణలు ,రెగ్యులర్ జూమ్ మీటింగ్ లే నిర్దేశిస్తున్నాయి.
     ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుడిని తరగతి బోధనాభ్యసనలో ఒక యంత్రపు పనిముట్టుగా మార్చి తరగతి గదిని ఇప్పటికే అర్ధరహితం చేశారు. ఆ యంత్రపు పనిముట్టు పనితీరు ఎలా వుందో పరిశీలించి, డి.ఈ.ఓ.లకు నివేదించటం,ఆ నివేదికలను జిల్లా కలెక్టర్ సమీక్షించటం ఇంత హైడ్రామా అవసరమా! రెండు రకాల ఎమ్మార్పీ ప్రయోగం విఫలమైన తరువాతనే కాంటాక్ట్ పద్దతిన క్లస్టర్ రిసోర్స్ పర్సన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.గతంలో నిర్వహించిన ఆ ఎమ్మార్పీ వ్యవస్థ ఉపాధ్యాయుల పై, బళ్ళపై చేసిన అర్ధరహిత పెత్తనం తిరిగి పునరావృతం కాకుండా ఉండడం అవసరం. ఈ నిత్య పర్యవేక్షణలు తరగతి గది బోధనకు అవసరమైన మార్గదర్శనం చేసే విధంగా,బోధనను మరింత మెరుగు పరిచే విధంగా ఉండాలి.
ఉపాధ్యాయుల పనితీరుపై అదే కేడర్ కు చెందిన మరో ఉపాధ్యాయుడి పర్యవేక్షణ ఉపాధ్యాయుల మధ్య అసంతృప్తి పెరిగేందుకు , కొన్ని సందర్భాలలో అశాంతికి దారి తీసే అవకాశాలు ఉంటాయి. ఉపాధ్యాయులకు తరగతి బోధన తప్ప మరేతర విధులు అప్పగించరాదనే ప్రాథమిక సూత్రానికి ఈ రెండు వేల మంది ఉపాధ్యాయ పర్యవేక్షక బృందం ఏర్పాటనేది విరుద్దమైనదనే ఆలోచన విద్యాశాఖకు లేకపోవటం శోచనీయం. పలు కారణాలతో తరగతి బోధన నుండి తప్పించుకొని తిరిగే పైరవీకారులే రేపటి ఈ పర్యవేక్షక బృందాలలో చేరటానికి ఆవకాశముంది. ఈ పర్యవేక్షక ఉపాధ్యాయ బృందాల ఏర్పాటు వలన బళ్ళలో ఆస్తవ్యస్థ ధోరణులు ప్రబలే అవకాశాలుంటాయని , అవినీతి ప్రబలుతుందని పాఠశాల విద్యావ్యవస్థ పక్కదొరి పడుతుందని విద్యారంగ మేధావులు , ఉపాధ్యాయ సంఘాలు తల్లిదండ్రుల కమిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఎంపిక ప్రహసనం కారాదు.

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యాన ఒక కమిటీ ఎంపిక చేస్తుంది. పదేళ్ళ బోధనానుభవం వున్న సీనియర్ ఉపాధ్యాయుల నుండి ఎంపిక చేస్తారు. ఎంపికకు మార్గదర్శకసూత్రాలు ఇంకా రూపొందించినట్టు లేదు. కానీ అర్హతా పరీక్ష , ఇంటర్వ్యూ ని‌ర్వహణ ద్వారానే ఎంపిక చేయటం,ఈ ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించటం పై ప్రభుత్వం దృష్టి సారించాలి. వీరి బాధ్యతల నిర్వహణ వీరు పని చేసే బళ్ళలో వీరి పీరియడ్ ల బోధన కుంటుపడకుండా నిర్దేశించాలి.పర్యవేక్షణ సమయంలో పాటించాల్సిన సంయమనం,పరిశీలనా పత్రాల,నివేదికల రూపొందించటం పై శిక్షణ తరగతులు నిర్వహించటం మేలు. ఈ వర్యవేక్షక బృందంలో ఎంపికైనవారి స్థానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపాలి.ప్రభుత్వం కానీ ఉన్నతిధికారులు కానీ మారిన ప్రతిసారి పాఠశాల విద్య నిర్వహణలో కొత్య విధానాలను అమలు చేయటం నిర్వహణలో మార్పు కనిపించవచ్చును. కానీ ఇప్పటికే అమలవుతున్న పాత విధానాల వైఫల్య సాఫల్యాల పై అనుభవజ్ఞులైన సీనియర్ ఉపాధ్యాయులచే క్షేత్ర స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకూ సమీక్ష చేయక పోవటం ఆక్షేపనీయం.

ఇప్పటికే జిల్లా స్థాయి లో సబ్జెక్ట్ నిపుణుల బృందం ఏర్పాటు జరిగింది. వారికన్నా భిన్నంగా రెండు వేల మందితో ఏర్పాటు కాబోయే పర్యవేక్షక ఉపాధ్యాయ బృందాల బాధ్యత లేముంటాయనే సందేహం రాక మానదు.ఈ విద్యా సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా విషయనిపుణుల ,పర్యవేక్షక బృందాల పేరిట దాదాపు నాలుగు వేల మంది ఉపాధ్యాయులు బోధనకు దూరం కానున్నారు. ఫలితంగా బోధనాభ్యసనల ప్రక్రియ కునారిల్లనుందనే సోయి ప్రభుత్వానికి లేకపోవటం శోచనీయం. కొత్త విధానాలు ఏవైనా పాఠశాలలను అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలి కానీ మూతబడే స్థితికి చేర్చేందుకు దోహదపడొద్దు. ప్రధానోపాధ్యాయుల సంఘం ,ఇతర ఉపాధ్యాయ సంఘాలు ,తల్లిదండ్రులు ప్రభుత్వం అమలు చేస్తున్న అవగాహనా రాహిత్య విధానాలపై చేస్తున్న ప్రశ్నించాలి. ప్రభుత్వ బళ్ళ ఉనికిని కాపాడుకోవాలి.
-వాడపల్లి అజయ్ బాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *