- సహజ వనరుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలి
- మండలస్థాయి వరకు వాల్టా అథారిటీలను నియమించాలి
- నీటివినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలి
- ఆకుపచ్చ తెలంగాణ కోసం వాల్టా చట్టాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది.
- పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
పర్యావరణ హితంగా ప్రజల అభివృద్ధి కోణంలో వాల్టా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికార్లను కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొట్టమొదటి సారి సచివాలయంలోనీ మంత్రి కార్యాలయంలో వాల్టా రాష్ట్రస్థాయి అథారిటీ సమావేశం మంగళవారం సీతక్క అధ్యక్షతన జరిగింది.
ఈసందర్భంగా తెలంగాణ వాటర్ లాండ్ అండ్ ట్రీస్ యాక్ట్, 2002 కు అనుగుణంగా జిల్లాస్థాయి అథారిటీల ఏర్పాటు, పర్యావరణం, సహజ వనరుల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ, టీజీ వోల్టా ఫండ్ ఏర్పాటు, అధిక నీటి వినియోగ గ్రామాల నోటిఫికేషన్ తదితర అజెండా అంశాలపై చర్చ జరిగింది. మంత్రి సీతక్క మాట్లాడుతూ మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాల్టా అథారిటీలను నియమించాలని కోరారు. సహజ వనరులను దుర్వినియోగం చేయకుండా, అవసరం మేరకే వినియోగించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.



