ప్రభుత్వ పనితీరుకు కలెక్టర్ల ప‌నిత‌న‌మే కొలమానం

26న అత్యంత ప్రతిష్టాత్మక పథకాలు వ‌స్తున్నాయ్‌..
అందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి..  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు..
కులగణన సర్వే 96 శాతం పూర్తి చేయ‌డంపై హ‌ర్షం

త‌మ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన సర్వే 96 శాతం పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్లకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెల్లేది కలెక్టర్లే అని,  కలెక్టర్ల పనితీరే ప్రభుత్వ పనితీరుకు కొలమానమ‌ని చెప్పారు.  కలెక్టర్లు తమ పనితీరును మరింత మెరుగుపరుచుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంద‌ని సూచించారు.  క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చామ‌ని,  కానీ కొంతమంది ఇంకా ఆఫీసులలో కూర్చునే పనిచేయాలని భావిస్తున్నారని సమస్యలు వొచ్చినప్పుడు సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంద‌న్నారు.  మీ పని తీరును మరింత మెరుగుపరుచుకోవాల‌ని సూచించారు.

వ్యవసాయ యోగ్యం కాని భూములకు కూడా గతంలో రైతు పెట్టుబడి సాయం అందించారు. అనర్హులకు రైతు భరోసా ఇవ్వొద్దు క్షేత్రస్థాయిలో వెళ్లి అనర్హులను గుర్తించాల్సిందేన‌ని,  భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో వన్ రేషన్ వన్ స్టేట్ విధానాన్ని తీసుకురాబోతున్నామ‌ని,  తెలంగాణలో ఒకరికి ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండాల‌న్నారు.  ఈ నెల 11 నుంచి 15 లోగా పథకాల అమలుకు కావాల్సిన ప్రిపరేటరీ వర్క్ పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ల‌ను సీఎం రేవంత్‌ ఆదేశించారు.

కలెక్టర్లు ఇందిరమ్మ అర్హుల జాబితాను ఇన్‌చార్జి మంత్రికి అందించాల‌ని,  ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతోనే కలెక్టర్లు అర్హుల జాబితాను విడుదల చేయాల‌న్నారు.  జనవరి 26న అంత్యంత ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేయబోతున్నామ‌ని,  ఇందుకు సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందని, గొప్పగా పనిచేస్తున్నదన్న నమ్మకం ప్రజలకు కలిగించాలన్నారు.  ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నెలలో ఒక్కసారైనా హాస్టల్స్ విజిట్ చేసి రాత్రి బస చేయాల‌ని ఆదేశించారు.  మహిళా అధికారులు బాలికల హాస్టల్స్ కు వెళ్లి అక్కడి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపాల‌న్నారు. సంక్షేమ ఫలాలు క్షేత్రస్థాయికి చేరేలా చర్యలు తీసుకోవాల‌ని, జనవరి 26 తరువాత తానూ ఆకస్మిక తనిఖీలు చేస్తాన‌ని,  నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *