- వెంగళరాయ సాగర్ పునరుద్ధరణకు రూ.33 కోట్లు
- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
- అశ్వారావుపేట నియోజకర్గంలో అభివృద్ధిపనులకు శంకుస్థాపన
దమ్మపేట,ప్రజాతంత్ర,జూన్ 20 : పేదల కలలను సాకారం చేసే దిశగా ఇందిరమ్మ ప్రభుత్వం పయనిస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం అశ్వరావుపేట నియోజకవర్గం లోని చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మరియు ములకలపల్లి మండలాల్లో విస్తృతంగా పర్యటించి ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురామిరెడ్డి, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మరియు భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో 130 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా నునావత్ పార్వతి ఇందిరమ్మ,ఇంటి పనులకు మంత్రి భూమిపూజ నిర్వహించారు. అనంతరం తిప్పనపల్లి గ్రామంలో కోటి రూ.70 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిసి రోడ్ల పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
అన్నపురెడ్డిపల్లి మండలం మర్రిగూడెం గ్రామంలో 34 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా అట్ల లక్ష్మి (భర్త మోహన్ రావు) ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ నిర్వహించారు. ములకలపల్లి మండలం మాదారం గ్రామంలో 24 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా పుష్పలత ఇందిరమ్మ ఇంటి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.ఈ పర్యటనలో భాగంగా మొత్తం ఐదు హై లెవెల్ బ్రిడ్జి పనులు చండ్రుగొండ మండలం సీతాయి గూడెం 2 కి. మీ వద్ద రూ.3.20 కోట్లు, అన్నపురెడ్డిపల్లి మండలం కంపగూడెం గ్రామం 1/0 కి. మీ వద్ద రూ.3.25 కోట్లు, ములకలపల్లి మండలం చింతలపాడు 3/4 కి. మి వద్ద రూ.2.10 కోట్లు మరియు ములకలపల్లి మండలం పాతూరు గ్రామం 0/400 కి. మి వద్ద రూ.1.60 కోట్ల వ్యయంతో చేపట్టనున్న హై లెవెల్ బ్రిడ్జ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూరాష్ట్రంలో ప్రతి పేదవాడి సొంతింటి కల సహకారం చేసేందుకు మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేశామన్నారు.
దీనిలో భాగంగా అశ్వరావుపేట నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయగా ఈ గిరిజన ప్రాంతానికి వెయ్యి అదనపు ఇందిరమ్మ ఇండ్లను కూడా మంజూరు చేశామన్నారు. తిప్పనపల్లి గ్రామంలో 130 ఇండ్లు మంజూరు అయ్యాయని అందులో 75 పైగా ఇళ్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నదని, మిగిలిన ఇండ్ల నిర్మాణం కూడా వేగవంతంగా చేపట్టాలని లబ్ధిదారులను మంత్రి కోరారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు దశలవారీగా ప్రతి సోమవారం నిధులను విడుదల చేస్తామన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.17 వేల కోట్లు రుణమాఫీ చేయగా, ప్రస్తుత ప్రభుత్వం 10 నెలల్లోనే రూ.21 వేల కోట్ల రూపాయలను రైతులకు మాఫీ చేసిందన్నారు. రైతు భరోసా పథకం కింద ఇటీవల తొమ్మిది రోజుల్లోనే రూ.9వేల కోట్లను రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. పేదల సంక్షేమానికై ఉచిత విద్యుత్, 500 కే గ్యాస్, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలతో పేదల సంక్షేమానికి పెద్దపీట ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వేస్తుందని అన్నారు.
చండ్రుగొండ మండలంలోని వెంగళరావు సాగర్ ప్రాజెక్టు పునరుద్ధరణకు రూ.33 కోట్లు మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. అశ్వరావుపేట నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంత్రి వెంగళరావు సాగర్ ప్రాజెక్ట్ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టు మరమ్మత్తులు, సర్కులర్ బీచ్ నిర్మాణం తదితర పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 2019 వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఈ ప్రాజెక్టు సమస్యను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ప్రాంత రైతులకు వెంగళరావు సాగర్ ప్రాజెక్టు జీవనాధారమన్నారు. గత ప్రభుత్వానికి ఈ గిరిజన ప్రాంతం ఇందులోని పంట పొలాలు కనిపించలేదని, పెద్ద పెద్ద ప్రాజెక్టులు వైపే చూసింది కానీ, కనీసం ఆలోచన లేకుండా వెంగళరావు ప్రాజెక్ట్ మరమ్మతులకు నిధులు ఇవ్వలేదని అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మరియు స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ కృషితో ఈ ప్రాజెక్టుకు జీవం పోసే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చిట్ట చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రాజెక్టులకు గౌరవం ఇవ్వని వారి పాలనతో పోలిస్తే ప్రజల ఆశయాలకు అనుగుణంగా వారి ఆశయాలను నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని మంత్రి చెప్పారు. ఈ పర్యటనలో హౌసింగ్ పిడి శంకర్, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వరరావు మరియు జిల్లా అధికారులు ప్రజలు పాల్గొన్నారు.





