సమ్మక్క సారలమ్మ జాతర ప్రాశస్త్యం

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 17 : రాష్ట్రంలో ములుగు జిల్లాలో జరిగే అతిపెద్ద, విశిష్ట ఆదివాసిల జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండు సంవత్సరాల కొకసారి జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరుగుతోంది. రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి సుమారు కోటిన్నరకుపైగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని అనుసరించి ఈ జాతర ప్రాశస్త్యమేమనగా 12వ శతాబ్దంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాతంలోని పొలవాసను పాలించే ఆదివాసి దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేశారు. ఈ దంపతులకు సారలమ్మ, జంపన్న ఇద్దరు సంతానం. కాకతీయులకు ప్రతీ సంవత్సరం చెల్లించే కప్పం కట్టలేదన్న కారణంతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తుతాడు.  ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా వుంటూ కరువు కాటకాల కారణంగా కప్పం కట్టలేక పోతాడు. కప్పం కట్టకపోవడం, రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణాలతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు. సాంప్రదాయ ఆయుధాల‌తో పగిడిద్దరాజు, నమ్మక్క, సారక్క, జంపన్న, గోవిందరాజులు విరోచితంగా పోరాటం చేసినప్పటికీ  సుశిక్షుతులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక పగిడిద్దరాజు, సారలమ్మ,  నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్యహత్యకు పాల్పడతాడు. అప్పటి నుంచి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్ప తిప్పలు పెడుతుంది. ఆదివాసి మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడవుతాడు. చివరికి సమ్మక్కను కాకతీయుల సైన్యం వెనుక వైపు నుండి బరిసెతో పొడుస్తారు. శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుకల గుట్టవైపు వెళుతూ మార్గమధ్యంలో అదృశ్యమవుతుంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల కుంకుమ భరిణ లభిస్తుంది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క – సారలమ్మ జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

ఆదివాసులే పూజార్లు

ఈసారి 2026 లో జనవరి 28 నుండి 31 వ తేదీ వరకు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర జరుగుతుంది. జాతర మొదటి రోజైన  28-01-2026 నాడు కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకు వస్తారు.  అదే రోజు కొండాయి నుండి గోవిందరాజులును,  పూనుగుండ్ల నుండి  పడిగిద్దరాజులను గద్దెలపై ప్రతిష్టింప చేస్తారు. రెండవ రోజున   29-01-2026 సమ్మక్కను చిలుకల గుట్ట నుండి పూజార్లు తీసుకోని వచ్చి గద్దెపై ప్రతిష్టింప చేస్తారు. మూడో రోజున శుక్రవారం పూర్తి మొక్కుల చెల్లింపు, నాలుగవ రోజు సాయంత్రం దేవ దేవతలను తిరిగి వన ప్రవేశం చేస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆదివాసులే పూజార్లు కావడం ఈ జాతర పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం నిర్వహించడం ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లము) నైవేద్యంగా సమర్పించుకుంటారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *