కాలం కడలి అలలలో

మనసుల ముత్యాలు ఎక్కడో జారిపోయాయి.

నగరాల నీలి కాంతుల్లో

నిజమైన వెలుగు నీడై మిగిలింది.

అద్దాల భవనాల మధ్య

అద్దంలా పారదర్శకమైన హృదయాలు

చీలికలు పడ్డాయి..

కానీ ఆ చీలికల్లోంచి రాలిన రక్తం

ఎవరికి కనిపించలేదు.

వేగం వేదమై మారిన ఈ యుగంలో

వెన్నెల మాటలు వాడుక తప్పాయి.

కన్నీరును కూడా కరెన్సీ లాగా

విలువ తూచే త్రాసులో కొలుస్తున్నారు.

ఒకప్పుడు

పేదవాడి పలుకులో పరమాత్మ ఉండేవాడు,

పరాయివాడి బాధలో

మనసు తడిచేది ఇప్పుడు..

తలుపులు పెద్దవయ్యాయి,

కిటికీలు మూసుకుపోయాయి.

కానరాని మానవతా ఆనవాళ్లు

గుండెల గర్భంలో గుసగుసలాడుతున్నాయి.

ఆశ్రయంలేని చూపుల్లో

ఆర్తనాదాలై ప్రతిధ్వనిస్తున్నాయి.

ఒక చిన్న చిరునవ్వు

ఒక చిత్తశుద్ధి గల మాట

ఒక కరుణామయ దృష్టి..

ఇవి విప్లవాల కంటే గొప్పవి ఎందుకంటే

మానవత్వం పుస్తకాలలో పుట్టదు,

పోరాటాలలో పెరగదు..

మనసు మరో మనసుని తాకినప్పుడు

మాత్రమే అది పువ్వులా వికసిస్తుంది.

మనం మనల్ని మించిన మనిషిని

మరో మనిషిలో చూసిన రోజు,

కాలం చెరిపేసిన ఆనవాళ్లు

కాంతులా తిరిగి రాసుకుంటాయి.

అప్పుడు.. ఈ భూమి

కేవలం జీవుల గూడెం కాదు,

జీవాల ఆలయం అవుతుంది.

శ్రీలత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *