– దేశం విడిచి పారిపోయిన మాజీ ప్రియుడు
– అతని నివాసంలోనే మృతదేహం
– దర్యాప్తు చేపట్టిన పోలీసులు
– చెన్నైలో నిందితుడి అరెస్ట్
న్యూదిల్లీ, జనవరి 5: అమెరికాలోని మేరీల్యాండ్లో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. హోవర్డ్ కౌంటీలోని ఎలికాట్ సిటీకి చెందిన తన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ నివాసంలోనే నిఖితా రావు గొడిశాల (27) అనుమానాస్పదంగా మృతిచెంది కనిపించింది. కత్తిపోట్లతో అతని అపార్ట్మెంట్లో విగతజీవిగా పడి ఉండగా పోలీసులు కనుగొన్నారు. అంతకుముందే అమె మాజీ బాయ్ఫ్రెండ్ అర్జున్ శర్మ దేశం విడిచి పారిపోయాడు. దానికంటే ముందు నిఖిత కనిపించడం లేదని అతనే పోలీసులకు జనవరి 2న ఫిర్యాదు చేయడం గమనార్హం. చివరిసారిగా తనను తన అపార్ట్మెంట్లో డిసెంబర్ 31న సాయంత్రం చూశానని వెల్లడించారు. ఈ మేరకు సెర్చ్ వారెంట్ జారీ చేసిన అధికారులు అర్జున్ ఉండే అపార్ట్మెంట్లో 3వ తేదీన సోదాలు నిర్వహించగా అక్కడ నిఖిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 31 సాయంత్రం 7 గంటల తర్వాత నిఖితను అర్జున్ చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నా రు. ఈ క్రమంలో అతని కోసం ఆరా తీయగా జనవరి 2 సాయంత్రమే భారత్కు వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అతడే నిఖితను హత్య చేసి దేశం విడిచి పారిపోయినట్లు భావిస్తున్నారు. అర్జున్ శర్మపై ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ మర్డర్ కేసుల కింద అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు హోవర్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. ఇండియాకు పారిపోయిన అర్జున్ను గుర్తించేందుకు ఫెడరల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల సాయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై భారత దౌత్య కార్యాలయం స్పందించింది. నిఖిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని.. అవనసరమైన అన్ని దౌత్య సహాయాలను అందిస్తామని వెల్లడించింది. స్థానిక అధికారులతో కూడా నిరంతరం ఫాలో అప్లో ఉన్నట్లు తెలిపింది.
చెన్నైలో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్ యువతి నిఖిత హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న ఆమె మాజీ బాయ్ఫ్రెండ్ అర్జున్ శర్మను ఇంటర్పోల్ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిఘా అధికారుల నుంచి అందిన కచ్చితమైన సమాచారంతో ఇంటర్పోల్ పోలీసులు తమిళనాడులో అనుమానితుడిని అరెస్టు చేశారు. అతడిని అమెరికాకు అప్పగించేందుకు అధికారిక పక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. నిఖిత మృతి వార్త తెలియగానే ఆమె తండ్రి ఆనంద్ కన్నీరుమున్నీరయ్యారు. తన కుమార్తె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయాలని అభ్యర్థించారు. మీడియాలో వస్తున్నట్లు అనుమానితుడు అర్జున్ శర్మ తన కుమార్తె మాజీ బాయ్ ఫ్రెండ్ కాదని తెలిపారు. అతడు చాలామంది నుంచి అప్పులు తీసుకున్నట్లు చెప్పారు.
నిఖిత హత్య విచారకరం: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
అమెరికాలోని కొలంబియాలో నిఖిత హత్యకు గురవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్రె్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె కుటుంబం తన సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని తార్నాక విజయపురి కాలనీలో నివాసం ఉంటోందన్నారు. ఆమె హత్యకు గురైన విషయం తెలిసిన వెంటనే జర్మనీ పర్యటనలో ఉన్న విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తో మాట్లాడానునని, నిఖిత భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకొచ్చేందుకు సహకారించాలని కోరానన్నారు. దిల్లీలోని తమ కార్యాలయం, పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆమె కుటుంబ సభ్యులతో నిరంతరం మాట్లాడుతూ అవసరమైన సహకారాన్ని అందిస్తోందని మంత్రి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



