కాళోజి జంక్షన్/ హన్మకొండ, ప్రజాతంత్ర, ఆగష్టు 19: మూడు రోజుల తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ లో భాగంగా కాకతీయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో మంగళవారం ఉదయం ప్లేనరీ సెషన్ నిర్వహించారు. ఈ సెషన్ లో హైదరాబాద్ సిసిఎంబి. డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె.నందుకూరి “టిబి-మెకానిస్టిక్ ఇన్సైట్స్ ఇంటూ హౌ ది కాజేటివ్ పాథోజెన్ సర్వైవ్స్ ఇన్ ది హోస్ట్” అనే అంశంపై పవర్ పాయింట్ చేశారు. తన ప్రసంగంలో ఆయన క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ లో ఔషధ నిరోధకత (Drug Resistance) పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాలుగా మారుతుందని వివరించారు. ఎంటీబీ లో డిఎన్ఏ రిపేర్ వ్యవస్థలో లోపం కలిగితే అది అధిక అనువర్తనశక్తిని పెంచుతుందనన్నారు. వివిధ పరిశోధనలు, అధ్యయనాలు చొప్పుతున్నాయని పేర్కొన్నారు. దాని ద్వారా కొత్త ఔషధ లక్ష్యాలను గుర్తించవచ్చని చూపించామని తెలిపారు. ఇటీవల 2237 క్లినికల్ స్ట్రెయిన్లపై జీనోమ్-వైడ్ అసోసియేషన్ విశ్లేషణ చేసిందన్నారు. ఔషధ నిరోధకతను ప్రేరేపించే కొత్త జన్యు కారకాలను గుర్తించామని స్పష్టం చేశారు. ముఖ్యంగా డిఎన్ఏ రిపేర్ జీన్స్లో ఉన్న వేరియంట్ మ్యూటేషన్లు వాటి పనితీరును దెబ్బతీసి, యాంటీబయాటిక్ లేదా హోస్ట్ ఒత్తిడి పరిస్థితుల్లో బ్యాక్టీరియా ఎక్కువ కాలం జీవించడానికి సహకరిస్తాయని ఆయన వివరించారు. ఈ పరిశోధన ఫలితాలు భవిష్యత్లో క్షయ వ్యాధి నియంత్రణకు, కొత్త ఔషధాల అభివృద్ధికి కీలకంగా మారుతాయని డా. వినయ్ నందుకూరి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆచార్య సిహెచ్ మోహన్ రావు, సైన్సు డీన్ ఆచార్య జి. హనుమంత్ నిర్వహించారు.
ప్రజారోగ్యానికి తీవ్రమైన సవాల్గా టీబీ





