ఉద్య‌మ చ‌రిత్ర‌ను మ‌లుపు తిప్పిన న‌వంబ‌ర్ 29

 – ప్ర‌త్యేక రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా అయింది
– గోదావ‌రి జ‌లాలు వ‌చ్చాయి
– సిద్దిపేట‌కు రైలు వ‌చ్చింది
– రాష్ట్రం కోసం ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టిన కేసీఆర్‌
– అటువంటి నాయ‌కుడు రాష్ట్రాన్ని మోసం చేస్తాడా?
– సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్‌రావు
సిద్దిపేట, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 27:  తెలంగాణ ఉద్య‌మ చ‌రిత్ర‌ను మ‌లుపు తిప్పిన రోజు 2009 న‌వంబ‌ర్ 29 అని మాజీ మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ‌గురువారం నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో ఆయ‌న ప్ర‌సంగించారు. నవంబర్ 29 కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితంగా రాష్ట్ర ఆవిర్భావం జ‌రిగింద‌న్నారు. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 లేదు.. డిసెంబర్ 9 లేకపోతే జూన్ 2 లేదు. జూన్ 2 లేకపోతే తెలంగాణ ఎక్కడిది? రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఎక్కడిద‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ వచ్చింది కాబట్టే సిద్దిపేట జిల్లా అయింది.. సిద్దిపేటకు గోదావరి జలాలు. రైలు, మెడికల్ కాలేజీ వచ్చాయి. దేశానికి అన్నంపెట్టే ధాన్యాగారంగా తెలంగాణ మారిందన్నారు. అనాడు కేసీఆర్  దీక్ష ప్రారంభించిన నాడు  సిద్దిపేటలో పాత బస్టాండ్ వద్ద దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకున్న సంగ‌తి గుర్తు చేసుకున్నారు. మొత్తం 1531 రోజులు శిబిరం నడిచిందని. అక్కడకు ప్రతి ఒక్క ఉద్యమకారుడు వచ్చారు.  కొన్ని వేలమంది శిబిరంలో పాల్గొన్నారు. అ శిబిరానికి గుర్తుగా ఒక పైలాన్ ఏర్పాటు చేసుకున్నాం. మోడల్ బస్టాండ్ నిర్మాణంతో దాన్ని తీసేసాం. మళ్ళీ పెడదాం అనుకుంటే ఆర్టీసీ అనుమతి ఇవ్వడం లేదన్నారు. ఆ ఉద్యమ జ్ఞాపకాల కోసం క్యాంపు ఆఫీస్ ముందు అ పైలాన్ ఏర్పాటు చేసుకోబోతున్నామ‌న్నారు. మ‌న‌మంతా సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి దీక్షా దివస్ ను ప్రారంభిద్దామ‌న్నారు. అక్కడినుండి కోటిలింగాల వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి వందనం సమర్పిర్పించి ముస్తాబాద్ చౌరస్తాలో జయశంకర్ సార్ విగ్రహనికి పూల మాల వేసి పాత బస్టాండ్ మీదుగా క్యాంప్ ఆఫీస్ వద్ద పైలాన్ శంకుస్తాపన చేసుకుందామ‌న్నారు. పార్టీ కార్యాలయంలో ఉద్యమ ఫోటో గ్యాలరీ పెట్టుకుందామని, ఆరోజు అమరుల కుటుంబాలను కూడా గౌరవించుకుని న్మానం చేద్దామ‌ని చెప్పారు. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి ప‌దేళ్లు పాలించి అభివృద్ధి చేసారు. ప్రాణాన్ని పణంగా పెట్టీ రాష్ట్రాన్ని సాధించిన అలాంటి నాయకుడు తెలంగాణను మోసం చేస్తాడా అని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డికి ఎంతసేపు ఓట్ల రాజకీయం తప్ప రాష్ట్రం మీద, ప్రజల మీద శ్రద్ధ లేదు. 42 శాతం రిజర్వేషన్లు అని బీసీలను మోసం చేశారు. రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ కు కాంగ్రెస్ నాయకులకు పోలిక లేదు. కాళేశ్వరం కూలిందని ప్రచారం చేస్తారు.. మరి మలన్నసాగర్ లో, కొండపోచమ్మలో నీళ్ళెక్కడివని ప్ర‌శ్నించారు. ఎక్కడ కాలువలు తవ్వి నీళ్ళు ఇస్తే కేసీఆర్కి పేరు వస్తుందోన‌ని ఆ పని ఆపేశారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి , ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వంటారు ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *