కంచా గచ్చిబౌలి లో భూ వివాదం పై సుప్రీం కోర్టు గట్టి ఆదేశాలు ఇవ్వడంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గి, సంబంధిత పక్షాలతో చర్చించి పరిష్కారం కనుగొనేందుకు కమిటీ ఏర్పాటు చేయాల్సి వొచ్చింది. విద్యార్థులు, పౌర సమాజం, ప్రతిపక్షాల నిరసనలను పట్టించుకోకుండా ముందుకెళ్లిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది గట్టి ఎదురు దెబ్బ ..రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లో మూసీ నది ప్రక్షాళన – మూసీ రివర్ ఫ్రంట్, హైదరాబాద్ నగరంలో ఆక్రమించబడ్డ చెరువులు, కుంటలను గుర్తించి వాటికి మళ్ళీ పునర్ వైభవం తీసుకు రావడానికి ఏర్పాటు చేసిన ‘హైడ్రా ‘ పలువురు పర్వావరణ ప్రేమికుల మన్ననలను పొందింది. మూసీ నది శుద్ధి చేసి, పునరుత్థాన పరచే కార్యక్రమం గతంలో చాలామంది ప్రయత్నించినా, అది ఈ సారి ఓ స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. మురికివాడల తొలగింపు, పారిశుధ్య నిర్వహణ, నదీ తీరాన వాల్క్ వే లు, పార్కులు, పర్యావరణ పరిరక్షణ చర్యలు ఈ ప్రాజెక్టులో భాగం . ఇక హైడ్రా ప్రాజెక్ట్ ద్వారా నగర అభివృద్ధిని సమగ్రంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయడం, పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల విస్తరణకు .. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, డ్రైనేజ్ వ్యవస్థ పునరుద్ధరణ, పచ్చదనం పెంపు వంటి అంశాలను దీని ద్వారా సమర్థంగా అమలు చేయవచ్చు.
ఇటువంటి బృహత్ కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, ‘లంగ్ స్పేస్‘ కోసం ఆలోచించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్, హైడ్రా లకు వ్యతిరేకంగా కంచా గచ్చిబౌలి 400 ఎకరాల భూమి ని పరిశ్రమల కోసం కేటాయించాలని ఆలోచన చేయడం పై పర్యావరణ ప్రేమికులు అభ్యంతరం తెలుపుతున్నారు. గ్రీన్ కవర్ను తొలగిస్తూ, రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను ప్రాధాన్యంగా చూపడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదానికి కేంద్రబిందువైనది—హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్ సి యు ) పక్కనే ఉన్న 400 ఎకరాల కంచా గచ్చిబౌలి భూములను ఐటీ, మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం వేలానికి పెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. ఈ నిర్ణయం అనంతరం ప్రభుత్వం ఆ భూముల్లోని చెట్లు, మొక్కలు తొలగించేందుకు ప్రయత్నించడంతో విశ్వవిద్యాలయం విద్యార్థులు నిరసనలకు దిగారు. అయితే, ఈ భూమి అటవీ భూమిగా ప్రకటించబడలేదని, ఇది రెవెన్యూ భూమేనని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ‘కంచా’ అంటే నిరుపయోగ భూమి అని, పాత రికార్డుల ప్రకారం ఇది రెవెన్యూ భూమిగా నమోదు అయిందని ప్రభుత్వం చెబుతోంది. భూమి అటవీ భూమా లేక రెవెన్యూ భూమా అన్నది పక్కనపెడితే, అసలు సమస్యలు—విశ్వవిద్యాలయం తో ఉన్న హద్దులు, ఈ 400 ఎకరాల భూమిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఖచ్చితమైన ప్రణాళికలు, మరియు ముఖ్యంగా, ఈ ప్రాంతంలోని జీవవైవిధ్యాన్ని ఎలా కాపాడతారు అన్నదే..!

ఈ భూముల వివాదానికి మూలం సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించిన నారా చంద్రబాబు నాయుడు ..2003లో అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఐ ఎం జీ భారత్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఐ ఎం జీ అథ్లెటిక్ అకాడమీ (ఫ్లోరిడా, అమెరికా ) అనుబంధ సంస్థకు గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో 400 ఎకరాలు అప్పగించి, స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు అనుమతించారు. అయితే ప్రభుత్వం మారిన తరువాత, కాంగ్రెస్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ సంస్థ ప్రతినిధి బిల్లీ రావు కోర్టును ఆశ్రయించినా, ఆయన పిటిషన్ తిరస్కరించబడింది. అనంతరం ఈ భూమిని తెలంగాణ ప్రభుత్వ సంస్థ పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కు అప్పగించారు. అటవీ భూములా, రెవెన్యూ భూములా అన్న విషయాన్ని పక్కనపెడితే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం పర్యావరణాన్ని తాకట్టు పెట్టి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకు దాసోహం అవుతోంది. ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని భూముల అమ్మకం,తాకట్టు పెట్టడం పై తీవ్ర స్థాయిలో విమర్శించింది. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ ద్వారా బలపరచాలనుకున్న నైతిక స్థానాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అర్ధాంతరంగా తాకట్టు పెడుతోంది.
ప్రస్తుతం అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ని భూముల అమ్మకం విషయం లో విమర్శిస్తున్న భారత రాష్ట్ర సమితి 2021-22 బడ్జెట్ నిమిత్తం రూ. 20,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా సుమారు 2,200 ఎకరాల ప్రభుత్వ భూములను కార్పొరేట్లు, ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకు ప్రయత్నించింది. ఈ భూముల్లో కొన్నిసార్లు రైతులకు అప్పగించబడిన భూములు కూడా ఉన్నాయి. ఇప్పటికీ ప్రభుత్వం వాటిని మార్కెట్ రేట్కు వేలం వేయాలని చూస్తోంది. అప్పుడు వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ గత పాలకుల విధానాలనే కొనసాగిస్తున్నది ఈ ధోరణిపై ప్రజల్లో చర్చ జరుగుతోంది—తెలంగాణ ప్రజల భూములు ఎవరివి ? వాటిని ఎలా వినియోగించాలి? ప్రస్తుతం బడ్జెట్ కోసం, సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చాలన్న కారణంతో ఇలా ప్రజల భూములను అమ్మడమే సరైన మార్గమా అన్నది ప్రశ్న. కేంద్రం అమలు చేసిన జీ ఎస్ టి విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ స్వయం నిర్ణయ అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో, భూముల అమ్మకం తాత్కాలిక పరిష్కారం మాత్రమే కానీ , అది రాష్ట్ర భవిష్యత్తుకు ముప్పే కావొచ్చు. ప్రజల భూములను వారి ప్రయోజనాల కోసం, ఉపయోగాల కోసం భద్రపరచాలి.
అంటే ప్రజల అవసరాలను తీర్చేలా, వనరుల విలువను నిలబెట్టేలా పాలన సాగాలి. కానీ ఉద్యోగాల కల్పన, ఆర్ధిక అభివృద్ధి పేరున కార్పొరేట్ రంగాలకు భూములను ఇవ్వడం ద్వారా, భవిష్యత్తులో రాజకీయ, ఆర్థిక వ్యవస్థ ఒకవైపే మొగ్గేలా అయ్యే ప్రమాదముంది. భూములు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లితే, సామాజిక అవసరాలకు ఉపయోగపడే విధంగా – ఉద్యోగావకాశాలు కలిగించే మౌలిక వసతుల వంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవచ్చు. ఇలాంటి భూ అమ్మకాలపై ఖచ్చితమైన నిబంధనలు లేకపోవడం వల్ల, భూములు కార్పొరేట్ ఎస్టేట్లుగా మారే ప్రమాదం ఉంది. ప్రజలకు ఆ భూములపై ఉన్న హక్కులు తొలగిపోతాయి. ప్రైవేట్ కంపెనీలకు లాభాపేక్ష ఉంటుంది కానీ ప్రజల సంక్షేమం పై దృష్టి ఉండదు. ఇలాగే కొనసాగితే, భవిష్యత్ తరాల కోసం ప్రజల భూములు మిగలకపోవొచ్చు. ఇది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ స్ఫూర్తి కి విరుద్ధం . తెలంగాణా అంటే—ప్రజల భూములు, వారి సంస్కృతి, వారసత్వం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు “ఆ భూముల్లో పులులు, జింకలు లేవు… గుంట నక్కలు మాత్రం కాచుకు కూర్చున్నాయి ” అనుకుందాం .. కానీ, నగరంలో మిగిలిన కొన్ని ‘లంగ్ స్పేసెస్’లో ఒకటైన కంచా గచ్చిబౌలిలో జీవవైవిధ్యాన్ని కాపాడటం మాత్రం ఆయన ప్రభుత్వ బాధ్యత కాదా? గతంలో బిఆర్ఎస్ చేసిన తప్పుల మార్గం లో కాంగ్రెస్ నడుస్తుందా ..?





