– తెలంగాణ పురోగతికి అన్ని చర్యలు
– కాంగ్రెస్కు అండగా నిలవండి
– రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ
– త్వరలోనే నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ
– సిద్ధిపేట స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ అన్ని రంగాల్లో ముందుండేలా ప్రభుత్వం సంకల్పం తీసుకుందనీ, తెలంగాణ భవిష్యత్ బాగుండాలంటే ప్రతి తెలంగాణ బిడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా ఉండాలని రాష్ట్ర బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ పిలుపునిచ్చారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని పోలీస్ కమిషనర్ కార్యాలయ ఆవరణలోని పరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ హైమావత్, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, సిపి డాక్టర్ అనురాధరెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డుల పంపిణీ చేస్తుందని, ఇది నిరంతర ప్రక్రియ అని కొత్త కుటుంబ సభ్యులు పేర్ల మార్పులు చేర్పులు కూడా చేయడం జరిగిందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్ల చొప్పున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామనీ, ఇప్పటి వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి అయ్యాయన్నారు. 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతు భరోసా కింద పంట పెట్టుబడి సహాయం అందించామనీ, రైతు రుణమాఫీ పూర్తి చేశామనీ, రాజీవ్ ఆరోగ్య శ్రీని రూ.5లక్షల నుండి రూ.10లక్షల రూపాయలకు పెంచుకున్నామనీ, అదనపు చికిత్సలు కూడా దీంట్లో చేర్చామన్నారు. ధనవంతులకే పరిమితమైన సన్న బియ్యం ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అందిస్తుందన్నారు.





