– సిఎం రేవంత్తో అమిటీ వర్సిటీ ఛాన్స్లర్
న్యూదిల్లీ, ఆగస్ట్ 7: తెలంగాణ విద్యారంగం(Telangana Education) అభివృద్ధికి తమ వంతుగా సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి అమిటీ యూనివర్సిటీ(Amity University) ఛాన్స్లర్ అతుల్ చౌహాన్ తెలిపారు. దిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి .రేవంత్ రెడ్డిని అమిటీ యూనివర్సిటీ ఛాన్స్లర్ అతుల్ చౌహాన్ గురువారం కలిశారు. తెలంగాణలో తమ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసినందుకు ముఖ్యమంత్రికి ఛాన్స్లర్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో తాము ఒప్పందం చేసుకుంటామని స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో భాగస్వాముల వుతామని చౌహాన్ సీఎంకు తెలియజేశారు. మెరుగైన వసతులు, నాణ్యమైన విద్యా బోధనతో ఇప్పటికే అమిటీకి మంచి పేరు ఉందని తెలంగాణలో మరింతగా రాణించేందుకు కృషి చేస్తామని సీఎంకు చౌహన్ తెలిపారు. కార్యక్రమంలో అమిటీ యూనివర్సిటీ ప్రతినిధి రామచంద్రం పాల్గొన్నారు.





