సిట్ ముందు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వాంగ్మూలం
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూలై17: బీఆర్ఎస్ పాలనలో వేల ఫోన్లు ట్యాప్ చేసి ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేసిండని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విమర్శించారు. గురువారం ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ఆయన హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా తీన్మార్ మల్లన్న స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. విచారణ అనంతరం మల్లన్నమీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టు సానుభూతిపరులనే ఆరోపణలతో తమ ఫోన్లు ట్యాపింగ్ చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో తన రెండు ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని తెలిపారు. అప్పటి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా, ప్రజల అభిష్టానికి మద్దతుగా పోరాడుతున్నాననే నా ఫోన్ ట్యాప్ చేశారన్నారు. నాతో పాటు నా అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని.. మా కదలికలు తెలుసుకోవడానికి ట్యాపింగ్కు పాల్పడ్డారని పేర్కొన్నారు. ప్రజల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం అప్పటి ప్రభుత్వానికి ఏమి వచ్చిందని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమైన నేరమని.. ట్యాపింగ్కి పాల్పడిన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ట్యాపింగ్ విషయంలో నా అభిప్రాయాన్ని సిట్ అధికారులకు చెప్పానని.. అవసరమైతే మళ్ళీ పిలుస్తామని అధికారులు చెప్పారని తెలిపారు.



