– యువకుడిది సిద్దిపేటగా గుర్తింపు
– దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బెంగళూరు,మార్చి 31: బెంగళూరులో విషాదం జరిగింది. తెలంగాణ సిద్దిపేటకు చెందిన యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా భర్త గదిలో ఆత్మహత్య చేసుకోగా ఇది తెలిసిన భార్య వెంటనే బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం జరిగింది. సిద్ధిపేట ప్రాంతానికి చెందిన భానుచందర్ రెడ్డి(32), అతడి భార్య బీబీ షాజియా సిరాజ్(31)లు బెంగళూరులోని కోతనూర్ ఏరియాలోని ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఇద్దరూ వృత్తిపరంగా సాప్ట్వేర్ ఇంజినీర్లే. వీరి పెళ్లై తొమ్మిదేళ్లు అవుతోంది. మొదట ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్లో ఉండి ఆ తర్వాత కొంతకాలానికి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైనప్పటి నుంచి ఇద్దరి మధ్యా విబేధాలు తలెత్తాయి. దీంతో తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో సోమవారం భానుచందర్ రెడ్డి తన గది లోపల తలుపు పెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఎంత పిలిచినా లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో ఆమె సెక్యూరిటీతోపాటు చుట్టుపక్కల వాళ్లను పిలిచింది. వారు వచ్చి తలుపు బద్దలుకొట్టి చూసేసరికి భానుచందర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది చూసి దిగ్భ్రాంతికి గురైన సాజియా వెంటనే అపార్ట్మెంట్ 17వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు జరుపుతున్నారు. వీరి మృతికి వైవాహిక కలహాలతోపాటు భాను చందర్ రెడ్డి అనారోగ్యం కూడా ఒక కారణం అయ్యుండొచ్చని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అధిక ఒత్తిడి, అనారోగ్యం, మానసిక సమస్యలు తదితర కారణాలేమైనా అయ్యుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుల తల్లిదండ్రులు ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. వీరి మృతితో ఇరు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



