డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర : ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్(AIJACTO) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే పార్లమెంట్ మార్చ్ (Teachers Parliament March Delhi ) కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి ఉపాధ్యాయులకు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
విద్యా హక్కు చట్టం అమలు కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే జాతీయ విద్యా విధానం 2020ని విరమించుకోవాలని, ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు టీచర్ ఎమ్మెల్సీ ఓటు హక్కు కల్పించాలని, ప్రభుత్వ పాఠశాలల మూసివేతను మానుకోవాలని, ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాల పనులు అప్పగించొద్దని, కాంట్రాక్టు ఉపాధ్యాయ, ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. వీరికి కనీస వేతన స్కేలు అమలు చేయాలని, ఎనిమిదో సెంట్రల్ పే కమిషన్ ను సకాలంలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలన్నీ ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడి ఫిబ్రవరి 5న పార్లమెంట్ మార్చ్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ జాతీయస్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు హాజరవుతారని, తెలంగాణ నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరు కావాలని సోమయ్య, లింగారెడ్డి కోరారు.





