– అందుకే మన రాజ్యాంగం పట్ల మేం గర్వపడుతున్నాం
– గవర్నర్ల కేసు సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆసక్తికర వ్యాఖ్య
న్యూదిల్లీ, సెప్టెంబర్ 10 (ఆర్ఎన్ఎ): బిల్లులను గవర్నర్లు పెండింగ్లో పెట్టే అంశాన్ని విచారిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్, బంగ్లాదేశ్లలో జరిగిన హింసాత్మక సంఘటనలను ప్రస్తావించింది. ఏప్రిల్ 12న ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టులో బుధవారం విచారణ జరిగింది. రాష్ట్రాలు రూపొందించిన బిల్లులను క్లియర్ చేయడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువును నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను ఇచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భారత రాజ్యాంగాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజా ప్రాముఖ్యత లేదా ఏ విధంగానైనా ప్రజల్ని ప్రభావితం చేసే ఏదైనా చట్టంపై రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరే హక్కును నిర్వచించింది. ‘మన రాజ్యాంగం పట్ల మేమే గర్విస్తున్నాము’ అని ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు. మన పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో చూడండి, నేపాల్ పరిస్థితిని చూశామని సీజేఐ అన్నారు. నేపాల్లో జెన్ జెడ్ యువత చేస్తు హింసాత్మక ఆందోళనల్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. బంగ్లాదేశ్ కూడా ఇలాంటివే జరిగాయని జస్టిస్ విక్రమ్ నాథ్ జోక్యం చేసుకున్నారు. గతేడాది బంగ్లాదేశ్లో హింసాత్మక అల్లర్ల కారణంగా, షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వొచ్చారు. ఒక నెలకు పైగా బిల్లులను రిజర్వ్ చేసే విషయంలో గవర్నర్లను సమర్థిస్తూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమర్థించిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లుల్లో 90 శాతం ఒక నెలలోపే గవర్నర్లు క్లియర్ చేస్తారని తుషార్ మెహతా కోర్టుకు వెల్లడించారు. 1970 నుంచి 2025 వరకు 20 బిల్లులు మాత్రమే రిజర్వ్ చేయబడ్డాయని కోర్టుకు తెలియజేశారు. అయితే, ఈ గణాంకాలను తాము పట్టించుకోమని న్యాయమూర్తులు అన్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన 7 బిల్లులను రిజర్వ్ చేయడంతో డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రాల బిల్లుల ఆమోదంలో న్యాయస్థానం తనకు గడువు నిర్దేశిరచడంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కోరిన అభిప్రాయం అంశమై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు బుధవారం వాదనలు కొనసాగాయి. సీజేఐ జస్టిస్ బి.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ ఎ.ఎస్.చందూర్కర్ సభ్యులుగా ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.