– ఇది పూర్తిగా ఎకనామిక్ సమ్మిట్
– 8న మధ్యాహ్నం ప్రారంభించనున్న గవర్నర్
– మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం
– 6 ఖండాలు 44 దేశాలు నుంచి 154 మంది ప్రతినిధులు
– 9న సాయంత్రం 6 గంటలకు ముగింపు
– మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి వివరాల వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ – 2025 సమ్మిట్ పూర్తిగా ఎకనమిక్ సమ్మిట్ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా దీన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నీతి అయోగ్, ఐఎస్బీ -హైదరాబాద్ సలహాలు, సూచనలతో విజన్ డాక్యుమెంట్ రూపొందించామని, రాష్ట్రానికి పెట్టుబడిదారులు రావాలనే సదుద్దేశంతో సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమ్మిట్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినదిగా అభివర్ణించారు. ఈ ఎకనమిక్ సమ్మిట్ రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 8న మధ్యాహ్నం 1:30 గంటలకు సమ్మిట్ ప్రారంభం అవుతుందని, కార్యక్రమాన్ని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఈ కార్యక్రమం నిర్వహించనుండడం అత్యంత సంతోషకరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలోని కేబినెట్ అంతా కలిసి ఆలోచనలు చేసి విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఎకనమిస్టులు ప్రసంగిస్తారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. కార్యక్రమంలో మొదటి రోజు 8న అభిజిత్ బెనర్జీ, ట్రంప్ డైరెక్టర్ ఆఫ్ ట్రంప్-మీడియా అండ్ టెక్నాలజీస్ గ్రూప్ నుంచి ఎరిక్ స్వేడర్, శ్రీధర్బాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.శివ కుమార్, నోబుల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, కిరణ్ మజుందార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తాను ప్రసంగిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. సమ్మిట్ నుద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2.30 నిమిషాలకు కీలక ప్రసంగం చేస్తారని చెప్పారు. సమ్మిట్ లో పలు విభాగాలకు సంబందించిన సెషన్స్ ఉంటాయని, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు సెషన్ లు ప్రారంభంమవుతాయని తెలిపారు. సెషన్ అంశానికి సంబంధించిన శాఖ మంత్రి, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు పాల్గొంటారని, ఈ సెషన్స్ లో నపుణులు కూడా పాల్గొంటారని, 9వ తేదీ కూడా ఇలాగే సెషన్స్ ఉంటాయని, ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు మొదలై సాయంత్రం 6 గంటలకు ముగుస్తాయని వివరించారు. ఈ సమ్మిట్ లో 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు పాల్గొంటున్నట్లు, ఒక్క అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు పాల్గొంటున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని, స్వయంగా అధికారులే వెళ్లి వారిని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను, సహచర మంత్రులు అందరం స్వయంగా వెళ్లి ముఖ్యులను ఆహ్వానించామన్నారు. అన్ని రాష్ట్రాలకు సమాచారం ఉండాలి అని అందరినీ పిలిచామన్నారు. సమ్మిట్ విజయవంతానికి ఎవరి స్థాయిలో వాళ్ళు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఎయిర్ లైన్స్ సమస్యకు వెసులుబాటు కలుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ముఖ్యమైన వారికి ఇబ్బంది తలెత్తితే ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఐటీ శాఖ మంత్రి దుది్దళ్ల శ్రీధర్బాబు, సీఎస్ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





