– బీసీల గొంతు కోసింది బీఆర్ఎస్సే
– కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం 17 శాతానికి తగ్గించిందన్న కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఖండించారు. ఈ అంశంపై ప్రజాభవన్లో మంత్రి సీతక్క గురువారం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోనే కుల గణన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసిందని పేర్కొన్నారు. 2014లో జరిగిన స్థానిక ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిందని, అయితే 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించి బీసీల గొంతు కోసిందని స్పష్టం చేశారు. ఈ అన్యాయాన్ని బీసీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని, బీఆర్ఎస్ నేతల అబద్ధాల ప్రచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. 2019 స్థానిక ఎన్నికల్లో రాష్ట్రం యూనిట్గా సర్పంచ్ల రిజర్వేషన్లను టీఆర్ఎస్ ఖరారు చేయగా ఆ విధానాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సర్పంచ్ రిజర్వేషన్లకు మండల యూనిట్గా, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు గ్రామ పంచాయతీ యూనిట్గా పరిగణనలోకి తీసుకున్నామన్నారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కుల గణనను పూర్తి చేసి అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేశామని, ఆ కమిషన్ నివేదిక ఆధారంగానే బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలననుసరించి 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తప్పనిసరిగా పాటించాల్సి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. కొన్ని మండలాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉండటంతో ఆ పరిమితిని దాటిపోకుండా ఉండేందుకు బీసీ రిజర్వేషన్లలో కొంత మార్పు జరిగినట్లు స్పష్టం చేశారు. సర్పంచ్ల రిజర్వేషన్లకు మండలాన్ని, వార్డు సభ్యులకు గ్రామాన్ని, జడ్పీటీసీ సభ్యులకు జిల్లాను, జడ్పీ చైర్మన్లకు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకున్నామని వివరించారు. బీఆర్ఎస్ నేతలు బీసీల మంచిని కోరుకునే పరిస్థితిలో లేరని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. కుల గణనలో బీఆర్ఎస్ పాల్గొనలేదని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లు నిలిచిపోవాలని కోర్టుల్లో అడ్డంకులు సృష్టించిన పార్టీ బీఆర్ఎస్సేనన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జంతర్ మంతర్ వద్ద చేసిన ధర్నాకు కూడా బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదని కూడా గుర్తుచేశారు. భద్రాచలం, ములుగు, ఆదిలాబాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో పీసా చట్టం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జనాభా ప్రాతిపదికన 100 శాతం గిరిజనులకు రిజర్వేషన్ల కేటాయింపు జరిగిందని, ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు అని మంత్రి స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడిన తండాలు, గూడేలు గ్రామ పంచాయతీలుగా మారడంతో గిరిజన సీట్ల సంఖ్య సహజంగా పెరిగిందని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్య విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, బీసీల గొంతు కోసింది ఎవరు, కుల గణనను అడ్డుకుంది ఎవరు, రిజర్వేషన్లపై అడ్డంకులు సృష్టించింది ఎవరు అన్న ప్రశ్నలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పోరాటం ఆగదని, కేంద్రంపై మరింత ఒత్తిడి తేవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేటీఆర్.. గుర్తుంచుకోండి.. అసత్య ప్రచారాలు ఎక్కువకాలం నిలవవు. నిజం మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది అని అన్నారు. ప్రభుత్వపరంగా పోరాటం చేస్తూనే పార్టీ పరంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమా అని సవాల్ విసిరారు. స్థానిక ఎన్నికలు ఆలస్యమైతే కేంద్రం నుంచి రావాల్సిన రూ.3,000 కోట్లు నిలిచిపోతాయని, అది గ్రామాల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని మంత్రి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



