– 45రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన
– అంతర్జాతీయ మీడియాలో కథనాలు
న్యూదిల్లీ, ఏప్రిల్ 6: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించే కాల్పుల విరమణ ప్రతిపాదనలను యూఎస్, ఇరాన్ పరిశీలిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇరు వర్గాలు 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేలా ముసాయిదా ప్లాన్ను మధ్యవర్తులు సిద్ధం చేసినట్టు మీడియా సంస్థ యాక్సియోస్ తెలిపింది. రెండు దశల్లో ఈ ప్లాన్ను అమలు చేసేలా ప్రణాళికలు రెడీ అయినట్టు పేర్కొంది. ఇరు దేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు పాకిస్థాన్, ఈజిప్టు, తుర్కియే, గల్ఫ్ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నట్టు డియాలో కథనాలు వెలువడ్డాయి. యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, యూఎస్ ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్తో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చర్చలు జరుపుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ఇరాన్ విదేశాంగ శాఖా మంత్రితో కూడా ఆసిమ్ మునీర్ కాల్పుల విరమణపై చర్చిస్తున్నట్టు పేర్కొంది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హోర్ముజ్ను తెరిచేందుకు ఇరాన్ సిద్ధంగా లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒత్తిడులు, తుది గడువులను సహించేది లేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదట్లో ఇరాన్కు ఏప్రిల్ 6ను డెడ్లైన్గా విధించారు. హోర్ముజ్ను తెరవకపోతే ఇరాన్లో నరకం కనిపిస్తుందని ఇష్టారీతిన తిడుతూ డెడ్లైన్కు ఒక రోజు ముందు ట్రంప్ ఓ పోస్టు పెట్టారు. ఈ తుది గడువును మరో 20 గంటల మేర పొడిగిస్తున్నట్టు తాజాగా ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన తాజాగా తెరపైకి వచ్చింది.
ఇరాన్కు మరో గట్టిదెబ్బ : ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖాదే మృతి
టెహ్రాన్, ఏప్రిల్ 6: ట్రంప్ బెదిరింపుల వేళ ఇరాన్కు మరో గట్టిదెబ్బ తగిలింది. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖాదే మరణించారు. ఈ విషయాన్ని ఐఆర్జీసీ ధ్రువీకరించింది. అయితే ఆయన ఎక్కడ హతమయ్యాడనేది వెల్లడించలేదు. టెహ్రాన్లోని నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని సోమవారం ఉదయం ఈ దాడులు చోటుచేసుకున్నాయి. అమెరికన్-జియోనిస్ట్ శత్రువు తెల్లవారుజామున జరిపిన క్రిమినల్ టెర్రరిస్ట్ దాడిలో తమ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ జనరల్ మజీద్ ఖాదే మరణించారని, ఆయన తన ఇంటెలిజెన్స్ విభాగంలో కీలక వ్యక్తి అని ఐఆర్జీసీ వెల్లడించింది. గత ఏడాది జూన్ 12న ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో జనరల్ మమహ్మద్ కజే మరణించడంతో ఆయన స్థానంలో మజీద్ ఖాదే బాధ్యతలు చేపట్టారు. ఇజ్రాయెల్-అమెరికా సోమవారంనాడు జరిపిన భారీ దాడుల్లో 25 మందికి పైగా మరణించారు. ప్రతిగా ఇజ్రాయెల్, గల్భ్ అరబ్ పొరుగుదేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపింది. ఫిబ్రవరి 28 ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభించడంతో ఆ దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. అనంతరం ఇరాన్ అత్యున్నత భద్రతాధికారి అలీ లారీజాన్ మరణం ఇరాన్కు మరో గట్టిదెబ్బ అయింది. మార్చి 17న నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్, ఆయన కుటుంబ సభ్యులను అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు మట్టుబెట్టాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రమైంది. ఈనెల 6లోగా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని, లేదంటే ఇరాన్ను సర్వనాశనం చేస్తామని ట్రంప్ డెడ్లైన్ విధించారు. గడువు ముగుస్తుండటంతో ఇదే చివరి అవకాశం అంటూ ట్రంప్ మరో రోజు గడువును పొడిగిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

