– నిర్లక్ష్యంతో ప్రాణాలు పోతే నాన్ బెయిలబుల్ కేసులు
– అరైవ్-అలైవ్ కార్యక్రమంపై ఉన్నతస్జ్థాయి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా అరైవ్-అలైవ్ కార్యక్రమంపై రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్లో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింగి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘అరైవ్- అలైవ’ వంటి మంచి కార్యక్రమం చేపట్టామని వెంకటరెడ్డి తెలిపారు. డీజీపీ శివధర్ రెడ్డి ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. రోడ్డు భద్రత అనేది ప్రభుత్వ విధానం మాత్రమే కాదు.. ప్రాణాలను కాపాడే బాధ్యత.. ఇది అందరం కలిసి తీసుకోవాల్సిన సామూహిక బాధ్యత అని చెప్పారు. దేశంలో అనారోగ్యం బారినపడి చనిపోయే వారికంటే ప్రమాదాల్లో చనిపోయే వారి సంఖ్య అధికంగా ఉన్నదన్నారు. ఎంవోఆర్టీహెచ్ లెక్కల ప్రకారం రోజుకు 18 నుండి 20 మంది ప్రమాదాల్లో చనిపోతున్నారు. ఇందులో 18 నుండి 40 ఏళ్ల లోపు వారు 60% ఉండడం దురదృష్టకరమని అన్నారు. 10మంది చనిపోయినా స్టేషన్ బెయిల్ మీద వస్తున్నారంటూ ఆ చట్టాన్ని సవరించాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు. హెవీ వెహికల్స్ (ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, లారీలు, టిప్పర్) నడిపే డ్రైవర్లకు అవగాహన కల్పించాలని, ఎక్కువ లోడ్ ఉండే వాహనాలు నడిపే వారికి కఠిన నియమాలు పెట్టాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగి ప్రాణం పోతే నాన్ బెయిలబుల్ వంటి కేసులు పెట్టి కఠిన శిక్షలు అమలు చేయాలని సూచించారు. డ్రంకెన్ డైవ్, రాష్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్ వంటి వాటి వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. వీటిపై ఇంకా కఠినంగా వ్యవహరించాలన్నారు. హెల్మెట్ ధరించడం, జీబ్రా క్రాసింగ్స్, సైన్ బోర్డులు ఏర్పాటు లాంటి కార్యక్రమాలు, బ్లాక్ స్పాట్లు గుర్తించి అందుకు తగ్గ చర్యలు తీసుకోవడం వల్ల 70 శాతం ప్రమాదాలను ఆపగలమన్నారు. తాను ప్రయాణించే హైదరాబాద్ – విజయవాడ హైవే మీద నిత్యం ప్రమాదాలు జరుగుతాయంటూ 17 బ్లాక్ స్పాట్లు గుర్తించి నిర్మాణం చేపట్టామని, ఇప్పటికే చాలావరకు పూర్తి అయ్యాయని చెప్పారు. రాత్రివేళ ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయంటూ ఆరఅండ్బి శాఖ ద్వారా పూర్తిస్థాయి రక్షణ చర్యలు చేపడతామని, ఇప్పటికే టి-రక్ష యాప్ అందుబాటులో ఉన్నదని తెలిపారు. స్కూల్స్, కళాశాలల పరిసరాల్లో బోర్డులు ఏర్పాటు తప్పనిసరి.. హెవీ వెహికల్స్ నడిపే వారికి, ఇతర డ్రైవర్లకు అందుకు తగ్గ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలకు అధికారులు ప్లాన్ చేయాలన్నారు. సినీ పరిశ్రమలో ప్రముఖుల ద్వారా అవగాహన కార్యక్రమాలకు రూపకల్పన చేయాలన్నారు. పోలీస్, ఆర్ అండ్ బి, ట్రాన్స్పోర్ట్, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేస్తే ‘అరైవ్-అలైవ’ విజయవంతం అవుతుందని చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



