రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సంక్షేమం అభివృద్ది రెండు కళ్లలా రాష్ట్ర బడ్జెట్ ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా బడ్జెట్ ఉంది. ఇది సామాన్యుల బడ్జెట్. అన్ని రంగాలకు అన్ని వర్గాలకు మేలు చేసేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. తెలంగాణ 2025-26 రాష్ట్ర బడ్జెట్ అన్నివర్గాల సమున్నతికి అద్దం పట్టేవిధంగా ఉంది.విద్య, వైద్యం, ఉపాధి, పారిశ్రామిక, మహిళా, రైతుల విభాగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రభుత్వం కేటాయించిన నిధులు రానున్న కాలంలో ఉత్తమ ఫలితాలను ఇవ్వనున్నాయి. పదేళ్లలో ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థే లక్ష్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలలో ప్రధానమైన ఆరు గ్యారంటీలకు నిధులు ఇవ్వడం అభినందనీయం.
ఇవేగాక వివిధ సందర్భాలలో ఇచ్చిన హామీలకు బడ్జెట్లో నిధుల రూపు కల్పించి చేతల ప్రభుత్వమని నిరూపించుకోవడం ప్రశంసనీయం అభివృద్ది పధకాలను ప్రజా సంక్షేమాన్ని సమతూకంగా పాటిస్తూ దాదాపు 3 లక్షల కోట్లకు పైగా బడ్జెట్గా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం సఫలమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు దళిత , బడుగు బలహీన వర్గాల ఆర్థిక పురోగతికి మార్గదర్శనం చేసేలా ఈ బడ్జెట్ ను శాసనసభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు , శాసనమండలిలో మంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెట్టి సువర్ణాధ్యాయానికి శ్రీకారం చుట్టారు. బడ్జెట్లో నిధుల కేటాయింపు కాంగ్రెస్ నిబద్ధతను ప్రస్ఫుటిస్తుంది. ఈ తెలంగాణ బడ్జెట్ ప్రస్తుత, భవిష్యత్ తరాల ప్రగతికి ఉజ్వల బాట వేస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు




